అన్ని రాజకీయ పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణఫై సమావేశం...
By: chandrasekar Fri, 23 Oct 2020 3:13 PM
ఈ నెల 28న
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై
చర్చించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు.
కరోనా నేపథ్యంలో వాయిదాపడ్డ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాన్ని
తెలుసుకోనున్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం
జరగనుంది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది. రాజకీయ
పార్టీలతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వంతోనూ దీనిపై చర్చించనున్నట్లు ఆ సర్క్యులర్లో
తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా ఈ
ఏడాది మార్చిలో జరగాల్సిన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడ్డ సంగతి
తెలిసిందే. అప్పట్లో ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం తీవ్ర
వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ
ప్రసాద్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో
ఆరోపణలు చేశారు. ఆ తర్వాతి పరిణామాల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డ
రమేష్ను ఏకంగా ఆ పదవి నుంచి తొలగించింది. అయితే దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును
ఆశ్రయించడంతో అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వం
సుప్రీంలో సవాల్ చేసినప్పటికీ న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో
ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తిరిగి ఎన్నికల కమిషనర్గా పునర్నియమిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.