తెలంగాణలో గిరిజన పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు
By: chandrasekar Sat, 30 May 2020 5:26 PM
తెలంగాణలో పోడు భూముల
సమస్యను పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా ముందుగా
పినపాక నియోజకవర్గంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి
నడుం బిగించిన ఎమ్మెల్యే రేగా. తెలంగాణలో వివాదాస్పదంగా మారిన గిరిజన పోడు భూములకు
శాశ్వత పరిష్కారం చూపడానికి పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ
విప్ రేగా కాంతారావు నడుం బిగించారు.
శనివారం మణుగూరు సింగరేణి
గెస్ట్ హౌస్లో రెవెన్యూ, ఫారెస్ట్
అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. వారి దగ్గర ఉన్న మ్యాపులు, ఫారెస్ట్ గెజిట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. పోడు
భూముల విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి గిరిజన రైతులకు న్యాయం చేస్తానన్నారు. ఈ
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి భూమికి హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని
ఎమ్మెల్యే తెలిపారు. రెవిన్యూ, అటవీ
భూముల లెక్కలు తేలితేనే ఇది సాధ్యం కాబట్టి జూన్ ఒకటో తేదీ నుంచి జాయింట్ సర్వేకు
అధికారులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే సూచించారు.
అటవీ శాఖ పరిధిలోని పోడు
భూములను గిరిజన రైతులకు ఇచ్చినందుకు ప్రతిగా రెవిన్యూ శాఖ దగ్గరున్న భూములను అటవీ
శాఖకు అప్పగించే దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఇలా చేయడం వల్ల పోడు భూముల
సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. బినామీల ముసుగులో అటవీ
భూములను అన్యాక్రాంతం చేసిన గిరిజనేతరులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి
ఉక్కుపాదం మోపే దిశగా అడుగులేస్తున్నారు. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్
జిల్లాల్లో అటవీ భూములకు సంబంధించిన వివాదాలున్నాయి.
గిరిజనులు సాగు చేస్తోన్న
అటవీ భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తిరిగి గిరిజనులు ఆ
భూముల్లో సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. పోడు
భూముల సమస్యను పినపాక ఎమ్మెల్యే కాంతారావు గతంలో సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లారు.
దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో పోడు భూముల సమస్య విషయమై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో
మాట్లాడారు. ఈ సమస్యకు ఎక్కడో ఓ చోట పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. పోడు
భూముల సమస్యను పరిష్కరించడం ద్వారా గిరిజన బిడ్డల బాధ పోగొట్టడంతోపాటు అడవులను
అన్యాక్రాంతం కాకుండా చూడొచ్చని కేసీఆర్ తెలిపారు.
ఎన్నికల కోడ్, లాక్డౌన్ తదితర కారణాల రీత్యా ఇన్నాళ్లూ పోడు భూముల
సమస్య పరిష్కారం చూపే అంశం వాయిదా పడుతూ వచ్చింది. తెలంగాణలో ముందుగా పినపాక
నియోజకవర్గంలో పోడు భూముల సమస్యను పరిష్కరించడం కోసం ఎమ్మెల్యే రేగా కృషి
చేస్తున్నారు. పోడు సమస్య పరిష్కారంతోపాటు అశ్వాపురం మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్
యూనిట్ ఏర్పాటు కోసం స్థల సేకరణ జరపనున్నట్లు ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు.
రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులతో మణుగూరు గెస్ట్ హౌస్లో భేటీ
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూన్ 1
తర్వాత జాయింట్ సర్వే ముగిశాక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సరిపడా స్థలాన్ని
సేకరిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంత ప్రజలకు
ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. ఎమ్మెల్యే కృషితో సమస్య
తీరుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.