ఐపీయల్ లో ఫిక్సింగ్ వ్యాఖ్యల కలకలం..ఫిక్సింగ్ చేయమన్నారని క్రికెటర్ ఫిర్యాదు
By: Sankar Sun, 04 Oct 2020 1:52 PM
కరోనా టైం లో కూడా ఎన్నో అవాంతరాలను దాటుకొని సజావుగా సాగుతున్న ఐపీయల్ 2020లో ఫిక్సింగ్ వార్తలకు ఒక్కసారిగా కలకలం రేపాయి..మ్యాచ్లో కరప్షన్కు పాల్పడాలంటూ తనను సంప్రదించారంటూ ఓ క్రికెటర్ బీబీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ)కు ఫిర్యాదు చేశాడు.. వెంటనే రంగంలోకి దిగిన ఏసీయూ విచారణ మొదలుపెట్టింది. ఇక నుంచి ప్రతీ మ్యాచ్ను నిశితంగా పరిశీలించాలని హైఅలర్ట్ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ తెలిపారు.. ఫిక్సర్ గురించి ఓ ఆటగాడు మాకు తెలిపాడు..
మేం అతడిని పట్టుకునే పనిలో ఉన్నాం.. దీనికి కాస్త సమయం పట్టవచ్చు అన్నారు. అయితే, ఏసీయూ గైడ్లైన్స్ ప్రకారం బుకీ సంప్రదించిన ఆటగాళ్లు లేక ఫ్రాంచైజీల పేర్లను వెల్లడించకూడదన్నారు. బుకీలు దుబాయ్లో తిష్టవేసారని తెలిపిన బీసీసీఐ ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్.. టోర్నీ సజావుగా జరిగేందుకు మూడు టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. బయోబబుల్లో ఉన్న ఆటగాళ్లను కలవడం బుకీలకు తలకు మించిన పనని, అది సాధ్యం కాదన్నారు. ఇక ఓ ఆటగాడిని బుకీని సంప్రదించాడనే సమాచారంతో అప్రమత్తమయ్యామని, విచారణ జరుగుతుందన్నారు.
వాస్తవానికి బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్లేయర్లను అజ్ఞాత వ్యక్తులు నేరుగా కలవడం దాదాపు అసాధ్యం. అయితే, ఆన్లైన్ నెట్వర్క్ ద్వారా బుకీలు సంప్రదించే ఛాన్స్ లేకపోలేదనే వాదన కూడా ఉంది. మొత్తానికి ఫిక్సింగ్ వ్యవహారం ఇప్పుడు ఐపీఎల్ 13లో కలకలం సృష్టిస్తోంది.