అహ్మదాబాద్లో డబ్బులు, నగల కోసమే పెళ్లి చేసుకుని పరారైన నవవధువు
By: chandrasekar Mon, 15 June 2020 3:36 PM
పెళ్ళై అత్తారింటికి
వచ్చిన నవవధువు సరిగ్గా నెలరోజులకే మెట్టినింటికి కన్నమేసి పారిపోయిన దారుణ ఘటన
చోటుచేసుకుంది. చెప్పాపెట్టకుండా పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఎంతకీ తిరిగి
రాకపోవడంతో ఫోన్ చేసిన అల్లుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు మామ. తన కూతురు ఇక
ఎప్పటికీ తిరిగిరాదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన అల్లుడు పోలీసులను
ఆశ్రయించాడు. ఈ ఘటన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. నగరంలోని నరోడా
ఏరియాకి చెందిన జయేష్ రాథోడ్కి మంచి పెళ్లి సంబంధం ఉంటే చూడమని అతని బంధువు మను
రాథోడ్ తన స్నేహితుడు మణిలాల్కి చెప్పాడు. సరేనన్న మణిలాల్ రాజస్థాన్కి చెందిన
కళావతి ఖరాదీ, ఆమె తండ్రి సంజీత్ ఖరాదీ సహా మరో వ్యక్తి మోహన్లాల్
భగోరాతో కలసి జయేష్ ఇంటికెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
ఇద్దరికీ నచ్చడంతో
పెద్దలు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా జయేష్, అతని
కుటుంబ సభ్యులు రాజస్థాన్లోని కళావతి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు తన ఆర్థిక
పరిస్థితి బాలేదని తనకు రూ.1.55 లక్షలు అప్పుగా ఇవ్వాలని పెళ్లికూతురి తండ్రి
అడిగాడు. సరిగ్గా ఐదు నెలల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో జయేష్ ఒప్పుకున్నాడు.
కాబోయే మామకి అడిగిన డబ్బు ఇచ్చాడు. అనంతరం జయేష్, కళావతి వివాహం జరిగింది.
మెట్టినింటికి వచ్చిన కళావతి నెల రోజులకే అత్తారింటిని సర్దేసింది. నగలు, ఇతరు
విలువైన వస్తువులతో ఉడాయించింది. ఓ రోజు సడెన్గా ఆమె కనిపించకుండా పోవడంతో
పుట్టింటికి వెళ్లి ఉంటుందని భర్త భావించాడు. ఎన్నిరోజులైనా తిరిగి రాకపోవడంతో
రాజస్థాన్లో ఉన్న మామకి ఫోన్ చేయడంతో అల్లుడి దిమ్మతిరిగిపోయింది. తన కూతురు
ఇంకెప్పటికీ అక్కడికి రాదని చెప్పడంతో కంగుతిన్నాడు. డబ్బులు, నగల కోసమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో షాక్కి
గురయ్యాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో భయపడిన జయేష్
పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో డబ్బు, నగలు దోచుకున్నారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు
చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.