ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు...మెట్పల్లి విశాల సహకార సంఘం ముట్టడి
By: chandrasekar Thu, 22 Oct 2020 3:01 PM
బుధవారం ధాన్యం
కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వెల్లుల్ల మండలంలోని రైతులు మెట్పల్లి
విశాల సహకార సంఘ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. తూకంలో మోసం చేయడంతో పాటు రైస్మిల్లుల
వద్ద ధాన్యంలో కోత విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను
ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయ షట్టర్లకు తాళాలు వేశారు.
ఈ సందర్భంగా రైతులు
మాట్లాడుతూ... యాసంగి పంట కాలంలో వెల్లుల్లలో విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం
కొనుగోళ్లు చేశారన్నారు. 40 కిలోల బస్తాకు
తప్ప పేరిట అదనంగా రెండు కిలోలు తూకం వేశారని తెలిపారు. తూకం వేసిన
ధాన్యాన్ని రైతులకు తక్పట్టీలు సైతం ఇవ్వకుండానే రైస్మిల్లులకు తరలించారని
పేర్కొన్నారు. ఖాతాల్లో తక్కువ డబ్బులు జమ కావడంతో ఇదేమిటని ప్రశ్నించగా, ధాన్యం
తడిచి మొలకలు రావడంతో రైస్మిల్లుల వద్ద 5 నుంచి 6 కిలోల వరకు తరుగు తీశారని చెప్పారన్నారు.
200 మంది రైతులకు చెందిన 4500 బస్తాలను తడిచిన ధాన్యం
పేరిట కోత విధించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఒక్కో రైతుకు రూ. 10 వేల
నుంచి రూ.50 వేల వరకు తక్కువ డబ్బులను జమ చేయగా, గ్రామంలోని
రైతులందరికీ సుమారు రూ. 35 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ
శ్రీనివాస్, తహసీల్దార్ రాజేశ్, ఎస్సై సదాకర్ వచ్చి
సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలుపడంతో రైతులు ఆందోళన విరమించారు.