పోలీసులపై మంచు లక్ష్మి కామెంట్స్
By: chandrasekar Mon, 20 July 2020 6:49 PM
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం
చేస్తోంది. ఈ ఆపత్కాల సమయంలో ప్రజా రక్షణ వ్యవస్థగా చెప్పుకునే పోలీసు యంత్రాగం
అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తమ ఆరోగ్యం, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా లాక్డౌన్ను
సమర్థవంతంగా అమలు చేస్తున్న పోలీసులు.. కరోనా వ్యాప్తి అదుపులోకి తీసుకురావడంలో
ప్రభుత్వానికి ప్రధాన సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి చెందిన
కొందరు పోలీసులు కరోనా బారిన పడటం జరిగింది.
తాజాగా ఈ విషయమై
స్పందించిన మంచు లక్ష్మి ఓ వీడియో ద్వారా పోలీసులకు సెల్యూట్ చేస్తూ వారి కృషిని
కొనియాడారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ ''అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. హైదరాబాద్
సిటీ పోలీసులందరికీ పెద్ద సెల్యూట్. నిజంగా ఈ లాక్డౌన్లో మీరెంత కష్టపడి
పనిచేశారో చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 98 మంది
పోలీసులు కరోనా బారినపడి మళ్ళీ కోలుకున్నారని తెలిసి చాలా సంతోష పడ్డాను. వాళ్లందరికీ
ప్రత్యేక ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు.
మమ్మల్ని కాపాడుతూ మా
జాగ్రత్తల గురించి, మా కోసం మీ ఫ్యామిలీస్ వదిలేసి బయటకొచ్చిన మీకు
ఎన్నిసార్లు కృజ్ఞతలు చెప్పినా అది తీరని ఋణం అని లక్ష్మి అన్నారు. అతి త్వరలో
మనమంతా కలుసుకోవాలని కోరుకుంటున్నా జై హింద్ అంటూ ముగించారు మంచు లక్ష్మి.
పోలీసులపై మంచు లక్ష్మి
రియాక్ట్ అయిన ఈ వీడియోను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తన ట్విట్టర్
ఖాతాలో పోస్ట్ చేశారు. ''పోలీసుల కష్టాన్ని మంచు లక్ష్మి గుర్తించారు'' అని
ట్యాగ్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.