ఆన్లైన్ క్లాస్ల నిర్వహణ మంచి విధానమే
By: chandrasekar Sat, 13 June 2020 1:00 PM
కరోనా పుణ్యమా అని
ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి. అందులో విద్యాబోధన కూడా చేరింది. బడి గంటలు
ఇంట్లో మోగుతున్నాయి. పాఠశాల వాతావరణంతో కళకళలాడుతున్నాయి. స్కూల్ మాదిరిగానే విద్యార్థులు సమయానికి
తయారై మొబైల్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముందు కూర్చొని ఉపాధ్యాయులు చెప్పే
పాఠాలు వింటున్నారు. అచ్చం పాఠశాలలో ఉన్నట్లుగానే టైం టేబుల్ నిర్ణయించుకుంటూ
విద్యాబోధన సాగిస్తున్నారు. మొత్తంగా అకాడమిక్ నష్టాన్ని భర్తీ చేస్తున్నారు.
అయితే ఆన్లైన్ క్లాస్ల నిర్వహణ మంచి విధానమే అయినా చాలా మంది విద్యార్థులు
పాఠాలు వినేందుకు ఆసక్తి చూపించడం లేదనేది
తల్లిదండ్రుల వాదన.
జూన్ మాసం వచ్చిందంటే
చాలు బడి గంటలు మోగుతాయి. పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫాంలంటూ తల్లిదండ్రులు బిజీ అవుతారు.
కాలనీలన్నీ స్కూల్ బస్సులు,ఆటోలతో సందడి వాతావరణం తలపించేవి. పిల్లలను
వెంటబెట్టుకుని పేరేంట్స్ స్కూల్లో విడిచిపెట్టడానికి బయలుదేరే దృశ్యాలు
కనిపించేవి. కానీ కరోనా మహమ్మారితో బడిగంట మూగబోయింది. జూన్-2న
ప్రారంభం కావాల్సిన పాఠశాలలు లాక్డౌన్తో తెరుచుకోలేదు. మహమ్మారి వ్యాప్తి భయం
తల్లిదండ్రుల్లో గుబులు రేపుతున్నది. ఇప్పట్లో పాఠశాలలు తెరుచుకున్నా
విద్యార్థులను పంపించబోమని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆన్లైన్
క్లాస్లతో విద్యార్థులకు స్వాగతం పలికింది.
నగరంలో సుమారు అన్ని
పాఠశాలలు ఆన్లైన్ బోధనకు సిద్ధమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఉదయం నిద్రలేచి ఆన్లైన్ క్లాస్లకు
రెడీ అవుతున్నారు. అన్ని సబ్జెక్టులు బోధించేలా టీచర్లు ఆ సమయంలో ప్రణాళికలు
చేసుకుంటున్నారు. స్కూల్ నుంచే సబ్జెక్టులను బోధిస్తున్నారు. జూమ్, గూగుల్
డ్యుయో తదితర యాప్లతో విద్యార్థులకు కనెక్ట్ అవుతున్నారు. యూకేజీ నుంచి పదో
తరగతి వరకు క్లాసులు జరుగుతున్నాయి. ఏ రోజు సెషన్ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు
రీపోస్ట్ చేస్తున్నారు. రెండోసారి పాఠాలు వినేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ప్రస్తుతం వైరస్
వ్యాప్తి పేరేంట్స్ను భయానికి గురి చేయడం సహజం. ఒకవేళ పాఠశాలలు ప్రారంభమైనా స్కూల్కు
పిల్లలను పంపించేవారు కాదు. ఈ సమయంలో ఆన్లైన్ క్లాస్ల నిర్వహణ మంచిదే. సమ్మర్
సెలవులు ముగిశాయి. వారిని ఏదో ఒక ఆక్టివిటీలో ఉంచేలా ఆన్లైన్ క్లాస్లు మేలు
చేస్తాయి. ఎక్కువ ఇబ్బందులు టీచర్లకే ఉంటాయి. వారందరినీ కంట్రోల్ చేస్తూ పాఠాలు
బోధించాల్సి ఉంటుంది. పేరేంట్స్ సహకరిస్తేనే ఆన్లైన్ పాఠాలతో ఉపయోగం ఉంటుంది.
క్లాస్ ప్రారంభంకాగానే
మొబైల్ నోటిఫికేషన్స్ మ్యూట్లో ఉంచడం లేదు. విద్యార్థులు అందరూ సెషన్లోకి
రావడానికి అరగంట, గంట సమయం తీసుకుంటున్నారు. దీంతో క్లాస్ నిర్వహణలో
ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న పిల్లలు ఎక్కువ సమయం ఎల్ఈడీ స్క్రీన్లను చూడటం
కొంత ఇబ్బందికరమే. క్లాస్ మధ్యలో నిద్రపోతున్నారు. కుదురుగా కూర్చోలేక అటు ఇటూ
కదులుతూ అల్లరి చేస్తున్నారు. ఏదో సినిమా చూసినట్లుగా భావిస్తున్నారని పేరేంట్స్
చెబుతున్నారు. టీచర్ ఎం చెబుతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు.