కరోనా భయంతో లిఫ్ట్ లోనే కుప్పకూలి చనిపోయిన వ్యక్తి
By: Sankar Sun, 16 Aug 2020 10:52 AM
కరోనా వ్యాధి కన్నా ఆ భయానికి ఎక్కువ మంది చనిపోతున్నారు.. జ్వరం, దగ్గు , జలుబు ఇలా తమలో ఏ పాటి లక్షణాలు కనిపించినా వెంటనే కరోనా టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారు. తాజాగా తిరుపతిలో ఓ వ్యక్తి కరోనా భయంతో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తిరుపతి- కరకం బాడి రోడ్డులోని వినాయకసాగర్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. కరోనా భయం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
ఓ కుటుంబంలో జలుబు, జ్వరంతో బాధపడుతూ తండ్రీ కొడుకులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. శనివారం బయటికి వెళ్లిన వీరు ఇంటికి వచ్చేందుకు అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోని లిఫ్ట్లోకి ప్రవేశించారు. కొడుకు లిఫ్ట్ తలుపులు వేస్తుండగా.. అతని సెల్ఫోన్కు కరోనా పాజిటివ్ అని మెసేజీ వచ్చింది. దీంతో ఆ మెసేజ్తో భయపడిన తండ్రి (67) గుండెపోటుతో లిఫ్ట్లోనే కుప్పకూలాడు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇక పాజిటివ్ వచ్చిన కొడుకును క్వారంటైన్కు తరలించారు.
కాగా తాజాగా ఏపీలో శనివారం ఒక్క రోజే 87 మరణాలు సంభవించగా, మొత్తం 2,500 దాటాయి. అయితే ఇందులో ఏపీ ప్రజలకు ఊరట కలిగించే విషయాన్ని వైద్య శాఖ వెల్లడించింది. శనివారం విడుదల చేసిన బులిటెన్లో కరోనా పాజిటివ్ కేసుల కంటే మహమ్మారిని జయించి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.