పోలీసుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నం
By: Sankar Sat, 26 Sept 2020 1:40 PM
హైదరాబాద్లో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలంగా మారింది. బోరబండకు చెందిన నీలం భార్గవ రామ్ ఎల్ఎల్బీ చదువుతున్నాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భార్గవ... స్థానిక సమస్యలపై పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషిచేసేవాడు. ఇటీవల భార్గవ.. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తుల వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద పిటిషన్ వేశాడు.
ఆలయ భూముల పరిరక్షణకు కూడా కృషిచేస్తున్న భార్గవ ఇందిరానగర్లో హనుమాన్ దేవాలయ భూ వివాదం పరిష్కారానికి ప్రయత్నించాడు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మాగంటి ఆదేశాల మేరకు స్థానిక ఎంఆర్వో ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా ప్రకటించే బోర్డు ఏర్పాటుచేశాడు. దీంతో ఎమ్మెల్యే జోక్యంపై భార్గవ రామ్ ట్విట్టర్లో నిరసన వ్యక్తంచేశాడు. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు భార్గవ్రామ్ను, అతని సోదరుణ్ని విచారించారు. మాగంటి ఆదేశాల మేరకే పోలీసులు తనను వేధించారని ఆరోపిస్తూ భార్గవ్ రామ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు.
ఇదే విషయమై భార్గవ రామ్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది కాలంగా ఎస్.ఆర్.నగర్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కులం పేరుతో దూషించడం, వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం వల్లే ఆందోళనకు, ఆవేదనకు లోనై ఆత్మహత్యకు యత్నించాదు. అయితే సదరు సీఐ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు బాధిత యువకుడు.