ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు పెంచిన మమతా బెనర్జీ
By: Sankar Tue, 30 June 2020 9:35 PM
కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూన్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఓ ప్రకటన చేశారు.
లాక్డౌన్ సమయంలో ప్రకటించిన ఉచిత రేషన్ పథకాన్ని 2021 జూన్ వరకూ పొడిగిస్తున్నట్లు ఆమె తెలిపారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించిన కాసేపటికే మమత ఈ ప్రకటన చేశారు. మోదీ కూడా తన ప్రసంగంలో పేదలకు ఉచితంగా ఆహార పదార్థాలను అందించే పథకాన్ని నవంబరు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా బెంగాల్లో కరోనా కేసులు 18,500 దాటేశాయి. ఈ రోజు కూడా రాష్ట్రంలో 650కి పైగా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 652 కరోనా కేసులు నమోదయ్యాయి. 15 మంది మరణించారు. 411 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,559కి చేరింది. వీరిలో 5,761మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 12,130మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 668మంది ప్రాణాలు కోల్పోయారు.