మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి జలదీక్షకు వెళ్లకుండా కొడంగల్లో పోలీసులు హౌస్ అరెస్ట్
By: chandrasekar Wed, 03 June 2020 2:50 PM
పెండింగ్ ప్రాజెక్టులకు
నిధుల కేటాయించాలనే డిమాండ్తో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు జలదీక్షకు
సిద్ధమైన కాంగ్రెస్ నేతలను ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధించింది. మల్కాజ్గిరి
ఎంపీ రేవంత్ రెడ్డి జలదీక్షకు వెళ్లకుండా కొడంగల్లో పోలీసులు హౌస్ అరెస్ట్
చేశారు. ఆయన బయటకు వెళ్లకుండా ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. నెట్టెంపాడును
సందర్శించేందుకు వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేత, ఏఐసీసీ
కార్యదర్శి సంపత్ కుమార్ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
గద్వాల జిల్లా శాంతినగర్లోని
సంపత్ కుమార్ నివాసంలోనే ఆయన్ను ఉంచారు. మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్
రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నాగర్కర్నూల్లో మాజీ మంత్రి
నాగం జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జలదీక్షకు వెళ్తున్న
ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాస్త ఘర్షణ నెలకొంది. నాగంను బయటకు రాకుండా
పోలీసులు ఇంట్లోనే ఉంచేశారు.
పెండింగ్ ప్రాజెక్టులను
పూర్తి చేయాలని కోరితే ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని
ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
కాంగ్రెస్ హయాంలో
చేపట్టిన ప్రాజెక్టును టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఈ జలదీక్షకు పూనుకుంది. చాలా చోట్ల ఇది ఉద్రిక్తతలకు దారి
తీసింది. చింతపల్లిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డిని
పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా వీరు రోడ్డుపై బైఠాయించారు.
అప్పుడు వారిని అరెస్టు చేశారు.