అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం చేయడానికి ప్రయత్నం
By: Sankar Mon, 14 Dec 2020 10:12 AM
అమెరికాలోని వాషింగ్టన్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు విఫల యత్నం చేశారు.
భారత్లో వ్యవసాయ చట్టాల రద్దుకి డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిక్కు అమెరికన్లు వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం ఎదుట శనివారం నిరసన ప్రదర్శనకు దిగారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఓహియో, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, వర్జీనియా నుంచి వందలాది మంది సిక్కు యువత కార్లతో ర్యాలీ చేస్తూ వాషింగ్టన్ చేరుకున్నారు.
గాంధీ విగ్రహం ఎదుట వారు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉండగా ఖలిస్తాన్ వేర్పాటు వాదులు జెండాలు చేతపట్టుకొని వారి మధ్యలోకి దూసుకువచ్చారు. ప్రత్యేక ఖలిస్తాన్ నినాదాలు చేస్తూ జెండాలతో గాంధీ విగ్రహం ముఖాన్ని కప్పేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు..అక్కడున్న సీక్రెట్ ఏజెంట్లలో ఒకరు విగ్రహాలను ధ్వంసం చేయడం చట్ట ప్రకారం నేరమని అక్కడ్నుంచి వెళ్లిపోమంటూ సలహా ఇవ్వడంతో వారు పారిపోయారు.