ప్లాస్మా థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.... మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి
By: Sankar Thu, 02 July 2020 7:38 PM
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చింది ..ముఖ్యంగా ఇండియాలో ఈ ఉదృతి తీవ్ర స్థాయిలో ఉంది ..మహారాష్ట్ర , ఢిల్లీ , తమిళనాడు వంటి రాష్ట్రాలలో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి...ముంబై లో కరోనా కేసుల తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు ..అధిక పాజిటివ్ కేసుల నమోదులో ముంబై మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి వచ్చిందని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం స్పందించారు. రాష్ట్రంలో వైరస్కు సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని స్పష్టం చేశారు. ఇక వైరస్ బారిన పడిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు..
అదే విధంగా కరోనా చికిత్సలో ప్లాస్మా థెరఫి కీలక పాత్ర పోషిస్తోందని రాజేష్ తోపే తెలిపారు. ఈ చికిత్సలో సుమారు 10 మంది కరోనా బాధితుల్లో 9 మంది కోలుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల మంది కరోనా పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకున్నారని వెల్లడించారు. చాలామంది పాజిటివ్ బాధితుల హిస్టరీ గమనిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా కేంద్రాల్లో, హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ తీవ్రతను గమనిస్తే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టేజ్కి చేరలేదని వెల్లడించారు. ఇక రెమిడిసివిర్, ఫావిపిరవిర్ మందులు మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో లభిస్తాయని తెలిపారు. ధనిక, పేద తేడాలు లేకుండా ప్రజలందరికీ ఈ మందులను అందుబాటులోకి తీసుకువస్తామని రాజేష్ తోపే చెప్పారు. ఇప్పటికే అక్కడ దాదాపు లక్షా డెబ్బై వేల మంది కోవిడ్ బారిన పడగా.. ఏడు వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి
ఇక మరోవైపు ముంబైలో రానున్న మూడు రోజుల్లో బారి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు..ఈ క్రమంలో శుక్ర, శని వారాల్లో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సిందిగా ముంబై పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవరసర పరిస్థితుల్లో మాత్రమే.. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావొచ్చని వెల్లడించారు.