- హోమ్›
- వార్తలు›
- మహారాష్ట్ర పోలీస్ శాఖలో అయిదు వేలకు చేరువవుతున్న కరోనా కేసులు ..గణాంకాలను వెల్లడించిన మంత్రి
మహారాష్ట్ర పోలీస్ శాఖలో అయిదు వేలకు చేరువవుతున్న కరోనా కేసులు ..గణాంకాలను వెల్లడించిన మంత్రి
By: Sankar Wed, 01 July 2020 8:20 PM
మహారాష్ట్ర పోలీస్ శాఖలో కరోనా మహమ్మారి తీవ్ర కలవరం రేపుతోంది. ఇప్పటి వరకు 4,938 మంది పోలీస్ సిబ్బంది కొవిడ్-19 బారిన పడినట్టు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఇందులో 60 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. చనిపోయిన 60 మందిలో 38 మంది ముంబై పోలీసులు ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3,813 మంది పోలీసులు కరోనా విషకౌగిలి నుంచి బయటపడ్డారనీ.. మరో వెయ్యి మందికి పైగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
కాగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కొవిడ్-19 ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై 1,39,702 కేసులు నమోదైనట్టు మంత్రి తెలిపారు. 29,298 మంది లాక్డౌన్ ఉల్లంఘనులు అరెస్టు కాగా.. 85,780 వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్టు తెలిపారు.
కాగా కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై 290 సందర్భాల్లో దాడులు జరిగాయనీ.. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 860 మందిని అరెస్ట్ చేశామన్నారు. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వారి నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 9.52 కోట్ల మేర జరిమానాలు వసూలయ్యాయని మంత్రి తెలిపారు