ఆషాడ మాస బోనాల్లో భాగంగా నేడు పెద్దమ్మ తల్లికి బంగారు బోనం
By: Sankar Thu, 09 July 2020 12:28 PM
తెలంగాణాలో అత్యంత వైభవంగా జరుపుకునే పండగ బోనాలు ..హైదరాబాద్ లో ఆషాడ మాసంలో ప్రజలు పెద్ద ఎత్తున ఈ బోనాలు పండుగ జరుపుకుంటారు ..అయితే ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా ఎవరి ఇంట్లో వారే పండుగ జరుపుకోవాలని ప్రభుత్వం సూచింది ..అయితే భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11–30 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారికి బంగారు పాత్రలో బోనం సమర్పించనున్నామని కమిటీ అధ్యక్షుడు జె.మధుసూదన్గౌడ్ తెలిపారు.
ఈసారి జరిగే ఆషాఢమాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఏడు దేవాలయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలను సమర్పిస్తున్నామన్నారు. సప్త మాతృకల సప్త బంగారు బోనం పేరుతో గోల్కోండ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, పెద్దమ్మ దేవాలయం, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి, చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం, లాల్దర్వాజా సింహవాహిణి దేవాలయం అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు.
ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ అమ్మవారికి బంగారు పాత్రలో బోనానంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించామన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఉప్పుగూడ మహాంకాళి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనాన్ని తీసుకెళ్లి పెద్దమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు సమర్పించనున్నామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో దేవాలయానికి వెళుతున్నట్లు ఆయన తెలిపారు.