Advertisement

16 వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన మహిళ

By: Sankar Mon, 12 Oct 2020 8:35 PM

16 వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన మహిళ


ఇప్పటికే 15 బిడ్డలకు జన్మనిచ్చిన ఓ మహిళ 16వ సారి గర్భం దాల్చింది. మరోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంత మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి ఇక అలసిపోయిందేమో.. చివరి ప్రసవం అనంతరం కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత కాసేపటికే ఆ శిశువు కూడా చనిపోయింది. మధ్యప్రదేశ్‌‌లోని దామోహ్‌ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది..

దామోహ్ జిల్లా పదజిర్ గ్రామానికి చెందిన సుఖ్రాని అహిర్వార్‌ వయసు 45 ఏళ్లు. ఆమె 16వ సారి గర్భం దాల్చింది. రెండు రోజుల కిందట ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఎప్పటిలాగే ఇంట్లోనే ప్రసవం చేయడానికి సిద్ధమైంది. ఆశా కార్యకర్త కల్లో బాయి విశ్వకర్మ ఆమెకు ప్రసవం చేసింది. కానీ, మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి నిమిషాల వ్యవధిలోనే కన్ను మూసింది. కాసేపటికే నవజాత శిశువు కూడా మృతి చెందింది.

అయితే.. సుఖ్రాని అంత మంది పిల్లల్ని కనాలని భావించడానికి కారణం ఏంటనేది తెలియదు. ఇప్పటివరకు ఆమె జన్మనిచ్చిన 15 పిల్లల్లో ఏడుగురు చనిపోయినట్లు ఆశా కార్యకర్త విశ్వకర్మ తెలిపారు. ‘ప్రసవం తర్వాత సుఖ్రాని, ఆమె నవజాత శిశువు పరిస్థితి విషమంగా మారటంతో వారిద్దరినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాం. అక్కడ చేరిన వెంటనే తల్లి.. ఆ తర్వాత కాసేపటికే బిడ్డ చనిపోయినట్లు తెలిసింది’ అని విశ్వకర్మ తెలిపింది.

Tags :
|
|

Advertisement