పోలీసుల వల్లనే ఆ తండ్రి కొడుకులు చనిపోయారు ..ఆధారాలు ఉన్నాయి ..మద్రాస్ హైకోర్టు
By: Sankar Tue, 30 June 2020 4:11 PM
తమిళనాడులో తండ్రి కొడుకులు పోలీస్ కస్టడీలో అనూహ్యంగా మృతి చెందిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ..అయితే పోలీసులు మాత్రం గుండెపోటుతో మరణించారు అని చెప్పారు .. జ్యుడిషియల్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్, బెనిక్స్లపై హేయమైన దాడి జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు రుజువైందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
తండ్రీకొడుకులపై దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు లభించాయి అని మంగళవారం పేర్కొంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ పోలీసు కస్టడీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో వారిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేయగా... గాయాలతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు..
ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేయగా... మృతుల బంధువులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారి అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం... జయరాజ్, బెనిక్స్ల మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహిస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీఎన్ ప్రకాశ్, జస్టిస్ పుగళేందిలతో కూడిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను మంగళవారం పరిశీలించింది. బాధితుల మృతదేహాలపై గాయాలు ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొంది.