కరోనా నుంచి బయట పడినవారిలో 90% మందిలో ఊపిరితిత్తుల సమస్య
By: chandrasekar Fri, 07 Aug 2020 11:44 AM
కరోనా వైరస్ కొత్త
సవాళ్లు విసురుతోంది. కరోనా నుంచి కోలుకున్న చాలా మంది హృదయ సంబంధ సమస్యలు
ఎదుర్కొంటున్నట్లు ఇప్పటికే కొన్ని పరిశోధనల్లో వెల్లడి అయింది. తాజాగా మరో అంశం
వెలుగులోకి వచ్చింది. కరోనా నుంచి కోలుకున్న వారికి ఊపిరితిత్తుల సమస్యలు
ఎదురవుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.
కరోనా వైరస్కు
జన్మస్థానమైన చైనాలోని వుహాన్కు చెందిన జాంగ్హాన్ హాస్పిటల్ వైద్య నిపుణుల
బృందం ఈ అధ్యయనం చేసింది. ఈ హాస్పిటల్ వుహాన్ యూనివర్సిటికీ చెందినది. ఈ అధ్యయన
వివరాలను గ్లోబల్ - టైమ్స్ ఓ కథనంలో ప్రచురించింది. వుహాన్ హాస్పిటల్లో
కోలుకున్న కరోనా బాధితుల్లో 90 శాతం
మంది లంగ్స్ సమస్యను ఎదుర్కొన్నారని వారిలో 5 శాతం
మంది తిరిగి క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చిందని పరిశోధకులు పేర్కొన్నారు.
కరోనా నుంచి కోలుకున్న
పలువురికి వీరు వైద్య పరీక్షలు నిర్వహించగా 90 శాతం
మందిలో ఊపిరితిత్తులు దెబ్బతినే ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఊపిరితిత్తులు
సంపూర్ణ ఆరోగ్యవంతుల మాదిరిగా పనిచేయలేదని తెలిసింది. కరోనా విజేతల
ఊపిరితిత్తుల్లో వాయు ప్రసరణ, గ్యాస్
ఎక్స్ఛేంజ్ విధులు సక్రమంగా జరగడంలేదని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.
‘వారిని
6 నిమిషాలపాటు నడిపించగా సగటున 400 మీటర్లు మాత్రమే నడవగలిగారు. అదే ఆరోగ్యవంతులైతే అదే
సమయంలో 500 మీటర్లు నడువగలరు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో బి-కణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. అంటే వీరి
రోగనిరోధక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదని’ అని వారు వివరించారు. ‘హాస్పిటల్ నుంచి
డిశ్చార్జి అయినవారిలో కొంత మందికి 3 నెలల
పాటు ఆక్సిజన్ సపోర్టు అందించాల్సి వచ్చింది. పది శాతం మందిలో కరోనా యాంటీబాడీలు
కనుమరుగైపోయాయి. అంతేకాదు, 5 శాతం మందికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్లో
నెగెటివ్ వచ్చినా ఇమ్యునోగ్లోబులిన్-ఎం పరీక్షలో పాజిటివ్గా వచ్చింది. వీరికి
కరోనా రెండోసారి సోకిందా అనేది మాత్రం స్పష్టం కాలేదు’ అని పరిశోధకుడు పెంగ్
జియాంగ్ పేర్కొన్నారు. కరోనాను జయించినవారిలో చాలా మంది కుంగుబాటుకు
గురవుతున్నారని పెంగ్ జియాంగ్ తెలిపారు. వారితో కలిసి భోజనం చేసేందుకు సొంత కుటుంబ
సభ్యులు కూడా విముఖత చూపుతున్నారని ఆయన వెల్లడించారు.