ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే గర్భిణులకు ‘లంచ్బాక్స్' పథకం
By: chandrasekar Sat, 05 Dec 2020 9:18 PM
తెలంగాణ ప్రభుత్వ
వైద్యశాలలకు వచ్చే గర్భిణులకు ‘లంచ్బాక్స్' పథకం అమలు చేశారు. వీరికోసం అంగన్వాడీల సాయంతో
ఆసుపత్రిలో భోజనం అందించనున్నారు. ద్యపరీక్షల కోసం ఎంతో దూరం నుంచి వస్తున్న నిండు
గర్భిణులు మధ్యాహ్నం వేళల్లో ఆకలికి ఇబ్బంది పడకుండా, పౌష్టికాహారానికి
దూరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అంగన్వాడీల సాయంతో
‘లంచ్బాక్స్' పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం, భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే కార్యక్రమం ప్రారంభమైంది. ఖమ్మంలో 9570 మంది, భద్రాద్రి
కొత్తగూడెంలో 8560 మంది గర్భిణులకు లబ్ధిచేకూరనుంది. కాగా కరోనా
నేపథ్యంలో ప్రయోగాత్మంగా కొన్ని సెంటర్లలో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఆకు కూరలతో కూడిన మంచి భోజనం, కోడి గుడ్డును అందించనున్నారు. ప్రతి అంగన్వాడీ
పరిధిలో ఉన్న సబ్ సెంటర్ మొదలుకొని పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కూడా
భోజనం అందించనున్నారు. సంపూర్ణ ఆరోగ్య సమాజమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం మరో
వినూత్న ఆలోచన చేపట్టింది. ముఖ్యంగా కాబోయే అమ్మల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ‘లంచ్బాక్స్' పేరుతో
నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గురువారం నుంచి ఐసీడీఎస్, వైద్యారోగ్యశాఖ
అధికారులు ప్రారంభించారు.
అమ్మల ఆరోగ్యంలో భాగంగా
ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఇబ్బంది పడకుండా వీరికి పౌష్టిక విలువలు కలిగిన భోజనం
అందించనున్నారు. ప్రస్తుతం అంగన్వాడీల్లో కొన్నేళ్ల నుంచి ఆరోగ్యలక్ష్మి పథకం
ద్వారా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు రుచికరమైన భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న
భోజనంతోపాటు ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు,
200 గ్రాములు పాలు అందిస్తున్నారు. మూడేళ్లలోపు
చిన్నారులకు బాలామృతం అందజేస్తున్నారు. అయితే వివిధ ఆరోగ్య పరీక్షల కోసం దవాఖానలకు
వెళ్లే గర్భిణులకు పోషక పదార్థాలు గ్యాప్ రాకుండా ఉండేందుకు లంచ్బాక్స్
పథకాన్ని ప్రవేశపెట్టింది. వివిధ ప్రాంతాల నుంచి సమీప ఆరోగ్య కేంద్రాలు, ఇతర
ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే గర్భిణులకు అక్కడే భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ
పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణులకు
మధ్యాహ్నం అందుబాటులోకి వచ్చినట్లయింది. ఐసీడీఎస్ పరిధిలో ఉన్న అంగన్వాడీ
కేంద్రాల నుంచి సదరు మహిళలకు భోజనం తీసుకవచ్చి అక్కడే వడ్డించనున్నారు. దీంతో
నిత్యం గర్భిణులకు అందించే ఆహారంలో తేడా లేకుండా చర్యలు తీసుకున్నట్లవుతుందని
అధికారులు పేర్కొంటున్నారు. మాతాశిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న
చొరవ పట్ల గర్భిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరోనా నేపథ్యంలో
ప్రయోగాత్మంగా కొన్ని సెంటర్లలో మాత్రమే చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో
పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది.
రానున్న రోజుల్లో అన్ని
సెంటర్లలో పూర్తి స్థాయిలో అందడానికి తగిన చర్యలు చేపట్టనున్నారు. అంగన్వాడీల్లో భోజనం తయారు చేసి ఆరోగ్య
కేంద్రాలకు వచ్చే గర్భిణులకు మధ్యాహ్న భోజనం అందించే ప్రణాళికను ఇప్పటికే జిల్లా
స్త్రీ, శిశు
సంక్షేమ శాఖ తయారు చేసింది. గర్భిణులు చెకప్ కోసం వచ్చే ముందు రోజునే ఆయా అంగన్వాడీ
కేంద్రాల టీచర్లు ఆశా కార్యకర్తలకు సమాచారం చేరవేస్తారు. దీంతో సదరు
వైద్యాధికారులు ఏయే ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆసుపత్రులకు వచ్చే వారి వివరాలను ఒక రోజు
ముందుగానే సమీప అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు సమాచారం అందిస్తారు. దీంతో మరుసటి
రోజు ఉదయం 9 గంటల సమయానికి నిర్ణీత కొలతలను ఆధారంగా ఆహారం సిద్ధం
చేస్తారు. ప్రతి గర్భిణికి 150 గ్రాముల అన్నం,
90 గ్రాములు పప్పుతో పాటు ఆకుకూరలతో కూడిన భోజనాన్ని
అందిస్తారు. దీంతో పాటు ఒక ఉడికించిన కోడి గుడ్డు సైతం అందజేస్తారు. ఇందుకు
సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేసిన జిల్లా సంక్షేమ కార్యాలయం ఆయా
ప్రాజెక్టులు, సెక్టార్ అధికారులకు అందజేశారు. ప్రస్తుతం స్త్రీ, శిశు
సంక్షేమ అధికారుల గణంకాల ప్రకారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9570 మంది
గర్భిణులకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 8560 మంది
గర్భిణులకు ప్రయోజనం చేకూరనుంది. మధ్యాహ్న భోజనం అందించే ప్రణాళిక వల్ల వీరు లాభం
పొందనున్నారు.