మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో దారుణం..సిబ్బందిపై దాడి చేసిన రోగి బంధువులు
By: Sankar Tue, 01 Sept 2020 3:38 PM
మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై దాడి జరిగింది. ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై కొందరు విచక్షణరహితంగా దాడి చేశారు.
టూటౌన్ సీఐ శ్రీనివాసాచారి తెలిపిన వివరాల ప్రకారం...ఆదివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో పట్టణంలోని కొత్త చెరువు రోడ్కు చెందిన కోట్ల బాలస్వామి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాగా వైద్యం అందించిన తరవాత బాధితుడి ఆరోగ్యం కొంతవరకు కుదుటపడింది. అయితే బాధితున్ని చూడటానికి ఎక్కువమంది రావడంతో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్ దేవానంద్, వార్డ్బాయ్ శంకర్లు వారిని అడ్డుకున్నారు.
దాంతో వచ్చిన వ్యక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. శంకర్ ను గుర్తు తెలియని ఆయుధంతో తలపై కొట్టడంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. దేవానంద్పైనా దాడి చేసి గాయపర్చారు. డ్యూటీలో ఉన్న వైద్యుడిపై దౌర్జన్యంగా మాట్లాడటంతో పాటు అతని విధులకు ఆటంకం కల్గించారు. ఈ ఘటనపై ఆర్ఎంఓ సాయిబాబ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఫిర్యాదు మేరకు మెకానిక్ బాలస్వామి, బాలరాజ్, పడకుల ప్రకాష్, మహేష్,కోట్ల నర్సింహులు, వెంకటేష్, రమేష్, శ్రీధర్, మెకానిక్ శ్రీను లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.