హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి లైసెన్స్ రద్దు...
By: chandrasekar Wed, 21 Oct 2020 3:59 PM
కర్ణాటక ప్రభుత్వం
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇకమీదట హెల్మెట్
లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. అక్టోబర్ 20 నుంచే
ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. బైకర్లు హెల్మెట్ ధరించకపోతే జరిమానాతో పాటు 3 నెలల
పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ఉత్తర్వుల్లో తెలియచేశారు. ఇందుకు
సంబంధించి అక్టోబర్ 16వ తేదీనే రవాణా శాఖ కమిషనర్ అన్ని ప్రాంతీయ రవాణా
శాఖ అధికారులకు లేఖ రాశారు.
నిబంధనలు ఖచ్చితంగా
అమలయ్యేలా చూడాలని సూచించారు. మోటార్ వెహికల్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం
కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రహదారి ప్రమాదాల్లో సంభవించే మరణాలకు
నియంత్రించడానికి సుప్రీం కోర్టు నియమించిన రోడ్డు భద్రతా కమిటీ చేసిన సూచనల మేరకు
ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం..
బైక్పై ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. వెనుక కూర్చొనేవారు
కూడా (నాలుగేళ్ల వయస్సు పైబడిన వారు) హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్
ధరించనివారిపై విధించే జరిమానా విషయంలో గతేడాది సెప్టెంబర్లో కర్ణాటక ప్రజల నుంచి
తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం రూ.1000గా
ఉన్న జరిమానాను రూ.500కు తగ్గించింది.