హైదరాబాద్లో ఓ ఇంటి కాంపౌండ్లో చిరుత కలవరం
By: chandrasekar Wed, 10 June 2020 12:21 PM
హైదరాబాద్ శివారులో మళ్లీ చిరుత కలకలంరేపింది. రాజేంద్రనగర్ సమీపంలోని వ్యవసాయ యూనివర్శిటీ పరిసరాల్లో చిరుత సంచరించింది. ఓ ఇంటి కాంపౌండ్లోకి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్లో చిరుతను చూసి స్థానికులు షాక్ తిన్నారు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్న అధికారులకు మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి. మే 14 వ తేదీన కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై డివైడర్ దగ్గర హల్చల్ చేసింది. తర్వాత స్థానికుల్ని చూసి భయంతో రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లి ఓ లారీ డ్రైవర్పై దాడి చేసింది. అక్కడి నుంచి మెల్లిగా జారుకుని సమీపంలో ఉన్న ఫామ్హౌస్వైపు వెళ్లింది.
వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అది అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని అధికారులు భావించారు. ఆ తర్వాత రెండు వారాల క్రితం రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించింది. అక్కడి నుంచి అది గగన్పహాడ్ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆ చుట్టుపక్కలే చిరుత పులి తిరుగుతుండడాన్ని అధికారులు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఓ ఇంటి కాంపౌండ్లోకి వెళ్లడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.