తన బయోపిక్ పై స్పందించిన చెస్ కింగ్ విశ్వనాథన్ ఆనంద్
By: Sankar Mon, 21 Dec 2020 6:10 PM
విశ్వనాథన్ ఆనంద్ ..ప్రపంచ చెస్ క్రీడలో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు ..ఇక భారత చదరంగానికి మకుటం లేని మహారాజు..దశాబ్దాలుగా భారత్లో చెస్ అంటే ఆనంద్ ..ఆనంద్ ను చూసి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఇండియాలో చెస్ వైపు అడుగులు వేశారు..ఇండియా నుంచి చెస్ లో తొలి గ్రాండ్ మాస్టర్ ..తొలి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత ఇలా చెప్పుకుంటూ పోతే ఆనంద్ సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి..అయితే కేవలం చెస్ గురించి తప్ప ఆనంద్ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలీదు...
అయితే ఆనంద్ జీవితంలోని అనేక అంశాలను అభిమానులను పరిచయం చేసేందుకు తనూ వెడ్స్ మనూ’ సినిమా తీసిన డైరెక్టర్ అనంద్ రాయ్ దర్శకత్వంలో రానుంది...అయితే ఈ బయోపిక్ పై తాజాగా ఆనంద్ స్పందించాడు...నాణ్యమైన చిత్రబృందం ఈ బయోపిక్ను తెరకెక్కించనుంది. కెమెరాతో వారు సృష్టించే అద్భుతాలను కనీసం నేను ఊహించలేను. అందుకే సినిమా గురించి పూర్తిగా వారికే వదిలేశా. సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంపై నాకున్న అవగాహన కేవలం 25 శాతం మాత్రమే.
తెరపై చూసినప్పుడు ఇది నా కథ అనే భావన నాకు కలిగితే చాలు. కాస్త వినోదాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ సినిమాను అభిమానులు ఎలా ఆదరిస్తారో అని తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది. నా బయోపిక్ చెస్ను సరళమైన ఆటగా చూపించాలి కానీ ఆటలోని తీవ్రతను తీసేయకూడదు అని అనుకుంటున్నా.
ఇప్పటికీ నా పాత్రను పోషించే నటుడెవరో తెలియదు. మిగతా తారాగణం, షూటింగ్ షెడ్యూల్ గురించి తెలియదు. రాయ్ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా పూర్తిగా చూసింది లేదు. నిజానికి అతని సినిమాలు చూసి, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంది అని అన్నారు..