మరొక సిరీస్ విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్
By: Sankar Fri, 21 Aug 2020 04:41 AM
కరోనా లాక్ డౌన్ తర్వాత వరుసగా సిరీస్ లు ఆడుతున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మరొక సిరీస్ విజయం పై కన్నేసింది..ఇప్పటికే వెస్ట్ ఇండీస్ పై టెస్ట్ సిరీస్ , ఐర్లాండ్ పై వన్ డే సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా మొదటి టెస్టులో ఘన విజయం సాధించింది..ఇక రెండో టెస్ట్ వర్షం , వెలుతురు లేమి కారణంగా డ్రా గా ముగిసింది..నేటి నుంచి పాకిస్తాన్తో ఆరంభమయ్యే చివరిదైన మూడో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలో దిగనుంది.
మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ ఇప్పటికే 1–0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం దక్కకపోయినా... కనీసం ‘డ్రా’ చేసుకున్నా సిరీస్ ఇంగ్లండ్ వశం కానుంది. మరో పక్క సిరీస్ తొలి టెస్టులో గెలుపు దారి నుంచి ఓటమి ఒడి చేరిన పాకిస్తాన్... ఈ మ్యాచ్లోనైనా సమిష్టిగా రాణించి సిరీస్ను ‘డ్రా’ చేయలానే పట్టుదలతో ఉంది. వర్షం, వెలుతురు లేమి సమస్యలతో రెండో టెస్టు 134.3 ఓవర్లు మాత్రమే సాగింది.
వెలుతురు సమస్యకు చెక్ పెట్టే పనిలో ఈ మ్యాచ్ షెడ్యూల్ కంటే అరగంట ముందుగానే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో స్థానానికి ఎగబాకుతుంది. వ్యక్తిగత కారణాలతో స్టార్ ఆల్రౌండ్ బెన్ స్టోక్స్ సిరీస్లోని దూరమైనా... ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పాకిస్తాన్ కంటే బలంగా కనిపిస్తోంది. రూట్ సారథ్యం ఆ జట్టుకు అదనపు బలం. గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతోన్న జేమ్స్ ఆండర్సన్ రెండో టెస్టులో లయ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు.
ఇక మరోవైపు బౌలింగ్ విభాగం లో పటిష్టంగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ లో పాకిస్తాన్ అంతగా రాణించలేకపోతుంది ముఖ్యంగా కెప్టెన్ అజర్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు..అయితే ఎప్పుడు ఎలా ఆడుతుందో పాకిస్తాన్ కె తెలియదు కాబట్టి మూడో టెస్టులో పాకిస్తాన్ విజయావకాశాలను కొట్టిపారేయలేము..