Advertisement

తిరుమల వెంకన్న భూముల అమ్మకం నిలిపివేత

By: Sankar Tue, 26 May 2020 09:16 AM

తిరుమల వెంకన్న భూముల అమ్మకం నిలిపివేత

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకంపై విమర్శలు రావడంతో ..ఆస్తుల అమ్మకాన్ని నిలిపి వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.. ఈ మేరకు భూముల విక్రయంపై గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

2016 జనవరి 30 తేదీన టీటీడీ ట్రస్టు బోర్డు 50 ఆస్తులు విక్రయించాలని తీర్మానించిందని, దీనికి సంబంధించిన తీర్మానం నెం.253 నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఆయా స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

గత తీర్మానానికి అనుగుణంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని కొద్ది రోజుల క్రితం టీటీడీ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు తీర్మానాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :
|

Advertisement