రుచి, వాసన చూసే సామర్థ్యం లేకపోవడం కూడా క్రొత్త కరోనా లక్షణాలు
By: chandrasekar Mon, 15 June 2020 2:44 PM
దేశంలో ఒక్కొక్కరిలో
ఒక్కో లక్షణం చూపిస్తూ ఈ వైరస్ బయట పడుతోంది. కొందరు అయితే ఏమాత్రం కరోనా లక్షణాలు
కనిపించకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ పరీక్షలకు
ప్రామాణికంగా మరో రెండు లక్షణాల జాబితాలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చేర్చింది.
రుచి, వాసన
సామర్థ్యాలను కోల్పోయే అంశాలను కూడా ఇప్పుడు కరోనా లక్షణాల జాబితాలో చేర్చారు.
పలువురు కరోనా రోగులు రుచి, వాసనను కోల్పోయినట్లు గుర్తించిన కేంద్రం ఈ లక్షణాలు
వున్నా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. సాధారణంగా కరోనా బారిన పడ్డవారు జ్వరం, దగ్గు, శ్వాస
తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, గొంతు నొప్పి, కఫం, డయేరియా వంటి సమస్యలతో బాధపడుతుంటే కరోనా సోకినట్లు
గుర్తించవచ్చని ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గడచిన 24
గంటల్లో కొత్తగా 11,929 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర
వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్లో 24 గంటల్లో ఇన్ని కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
పదమూడు రకాల లక్షణాల్లో ఏవి ఉన్నా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.
ఇప్పుడు ఈ లిస్ట్లో రుచి, వాసన చూసే సామర్థ్యం లేకపోవడం కూడా వచ్చి చేరడంతో
కరోనా లక్షణాల సంఖ్య 15 కు చేరింది.
దేశంలో కరోనా రోజురోజుకీ
కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు రోజురోజుకూ కరోనా
మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో భారత్లో కరోనా
సోకి చికిత్స పొందుతున్న వారిలో 311 మంది మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో
భారత్లో కరోనా మరణాల సంఖ్య 9195కు చేరింది. ఇప్పటివరకూ 3,20,922 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,49,348. ఇప్పటివరకూ భారత్లో 1,62,379 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రజలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
సూచనలు చేసింది.