ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న కేటీర్
By: chandrasekar Thu, 13 Aug 2020 04:21 AM
ఆహార శుద్ధి రంగ
పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న కేటీర్. రాష్ట్రంలో ఆహార శుద్ధి
రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య
శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్
పాలసీలపై మంత్రివర్గ సహచరులతో కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. తెలంగాణలో
రోజు రోజుకి పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, దాని వల్ల మనకు ఆహార శుద్ధి రంగంలో వస్తున్న నూతన
అవకాశాల గురించి మంత్రి వివరించారు.
అయన మాట్లాడుతూ తెలంగాన
సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణలో జలవిప్లవం వస్తుందని తెలిపారు. లక్షలాది ఎకరాల
బీడు భూములు కృష్ణా, గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని కేటీఆర్
వివరించారు. ఈ జల విప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులాబీ
విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ), శ్వేతా విప్లవం (పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో
రానున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో గొర్రెల పెంపకం, చేప
పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో వీటి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. దీనిద్వారా
అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలిగిందని దీనితోపాటు రాష్ట్రాభివృద్ధి కూడా
పొందిందన్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి
సూచన మేరకు తెలంగాణలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏ పంటలు పండుతున్నాయనేది పూర్తిగా
మ్యాపింగ్ చేశామని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు
ధాన్యాలు, సుగంధ
ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి
అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం మనకు లేదు. ఇక ఇరిగేషన్
ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. దీంతో ఆహార శుద్ధి
రంగ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా తెలంగాణ రైతులకు
ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో
ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు
ప్రతిపాదిస్తున్నామని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలను పరిశీలించామని మంత్రి
కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయ మార్పులు
చోటుచేసుకుంటాయని తెలిపారు.