ఖమ్మంలో ఐటి హబ్ ...ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
By: Sankar Mon, 07 Dec 2020 09:11 AM
ఇంతకాలం ఐటీ అంటే తెలంగాణాలో హైదరాబాద్ ఏ గుర్తొచ్చేది అయితే ఇప్పుడు కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ద్వీతీయ శ్రేణి పట్టణాలలో కూడా ఐటీ రంగం విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ లను ఏర్పాటు చేస్తుంది...ఖమ్మంలో కొత్తగా ఏర్పాటు అయిన ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు.
యువతకు శిక్షణ కల్పించి, నైపుణ్యాలు పెంచి అన్ని రంగాల్లో తీర్చిదిద్దే లక్ష్యంతో నగరంలో ఈ ఐటీ హబ్ ప్రారంభం కానుంది. 16 కంపెనీలు ఖమ్మం ఐటీ హబ్లో పని చేయబోతున్నాయి. ఖమ్మం యువతకు ఐటీ హబ్ ఓ ఆశాదీపంగా నిలవనుంది. ఐటీ పరిశ్రమ కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్లో భాగంగా అత్యాధునిక హంగులతో ఖమ్మంలో ఐటీ సౌధాన్ని నిర్మించారు.
దాదాపు 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్ను రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించారు. రెండేండ్లలోనే దీన్ని పూర్తి చేయడం విశేషం. ఇప్పటికే 16 కంపెనీలు ఈ ఐటీ టవర్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇవన్నీ ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన కంపెనీలు కావడం మరో విశేషం. ప్రస్తుతం 430 మందిని నియమించుకున్నారు. త్వరలో మరో 430 మందిని నియమించుకోనున్నారు. దీంతో రెండు షిప్టుల్లో 860 మంది పనిచేయనున్నారు.