తెలంగాణ పేద ప్రజలకు శుభవార్త... డబుల్ బెడ్రూం ఇళ్లకు కేటీఆర్ ప్రారంభోత్సవం...!
By: Anji Mon, 26 Oct 2020 11:52 AM
తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త. కేసీఆర్ ప్రతిష్టాత్మక డబుల్ బెడ్రూం పథకం ఇళ్లకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్లో192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్షులైన పేదలకు మంత్రి అందించారు. ఇందుకు సంబంధించిన ఆయా ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షించారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కొన్ని ప్రాంతాల్లో మినహా అనేక చోట్ల ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో నిర్మాణాలు పూర్తైన ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా ఇళ్ల పంపిణీ మొదలుపెట్టారు.