నగరంలో త్వరితగతిన విద్యుత్ మరియు నీటి సరఫరాకు కేటీఆర్ ఆదేశం
By: chandrasekar Sat, 17 Oct 2020 09:53 AM
హైదరాబాద్ నగరంలో కురిసిన
భారీ వర్షాల వల్ల నిలిచిన విద్యుత్ మరియు నీటి సరఫరాకు త్వరితగతిన
పునరుద్ధరించడానికి మంత్రి కేటీఆర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిన అపార్ట్మెంట్లు, కాలనీలకు
24 గంటల్లో
విద్యుత్ సరఫరా పునరుద్దరించాల్సిందిగా మంత్రి కేటీఆర్ అధికారులను
ఆదేశించారు. ఇందుకు జీహెచ్ఎంసీ, విద్యుత్శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మూడో
రోజు విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో
జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం
నిర్వహించారు.
నగరంలోని భారీ వర్షాలతో
దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ. 297 కోట్లతో పనులు చేపట్టాలని
ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా
చేయాలని వాటర్ వర్క్స్ అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రూ. 50 కోట్లతో
దెబ్బతిన్న సివరేజి, వాటర్ పైప్లైన్ల పునరుద్దరణ పనులు చేపట్టాలని
తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని
జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ను ఆదేశించారు. ప్రజలకు వరద నీటి
వల్ల అనారోగ్యం కలగకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్యశాఖతో సమన్వయం
చేసుకొని వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.