- హోమ్›
- వార్తలు›
- కేరళ విమాన ప్రమాదం కాదు హత్య ..తీవ్ర వ్యాఖ్యలు చేసిన పౌరవిమానయాన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్
కేరళ విమాన ప్రమాదం కాదు హత్య ..తీవ్ర వ్యాఖ్యలు చేసిన పౌరవిమానయాన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్
By: Sankar Sun, 09 Aug 2020 6:41 PM
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదానికి ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి (టేబుల్టాప్) రన్వే విమానాలు దిగేందుకు ఏమాత్రం సురక్షితం కాదని 2011లోనే పౌరవిమానయాన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అప్పటి పౌరవిమానయానశాఖ కార్యదర్శి నసిమ్ జైదీకి 2011 జూన్లో నేరుగా కూడా చెప్పారు.
కానీ ఆ నివేదికను అధికారులు పట్టించుకోలేదని మోహన్ రంగనాథన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి ప్రమాదంపై ఆయన స్పందించారు. ‘రన్వే తడిగా ఉండి, భారీ ఈదురుగాలులు వీస్తున్నప్పుడు విమాన సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని లాండింగ్ చేయటానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ అక్కడ ఏఎల్ఏఆర్ (అప్రోచ్ అండ్ లాండింగ్ యాక్సిడెంట్ రిడక్షన్) పరిస్థితులు చాలా బలహీనంగా ఉంటాయి.
వర్షం పడుతున్నప్పుడు కోజికోడ్ విమానాశ్రయంలోని ‘రన్వే 10’లో విమానాన్ని లాండ్ చేయటమంటే అందులోనివారందరూ మహా ప్రమాదంలో ఉన్నట్టే. ఇక్కడ ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే అది సాధారణ ప్రమాదం ఎంతమాత్రం కాదు. వారందరూ హత్యకు గురయ్యారని చెప్పాల్సి ఉంటుంది’ అని మోహన్ రంగనాథన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
కోజికోడ్ విమానాశ్రయంలోని పదోనంబర్ రన్వే జారుడు బండలాగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘తొమ్మిదేండ్ల క్రితమే ప్రమాదాల గురించి హెచ్చరించి తగిన ఆధారాలు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఆ రన్వేపై ఇంకా విమానాలను నిర్వహిస్తున్నారు. అది అన్నిరకాలుగా భద్రమైనదని కూడా ప్రకటించారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.