Advertisement

  • రాజస్థాన్ పై గెలుపుతో నాలుగో స్థానానికి చేరిన కోల్‌కతా

రాజస్థాన్ పై గెలుపుతో నాలుగో స్థానానికి చేరిన కోల్‌కతా

By: chandrasekar Mon, 02 Nov 2020 09:35 AM

రాజస్థాన్ పై గెలుపుతో నాలుగో స్థానానికి చేరిన కోల్‌కతా


దుబాయ్ లో జరిగిన ఐపీల్ 2020 సీజన్లో ఊహించని ఓటమితో రాజస్థాన్ ఇంటిముఖం పట్టింది. రాజస్థాన్ పై కోల్‌కతా గెలవడంతో నాల్గవ స్థానానికి చేరింది. ఐపీల్ 2020 సీజన్‌ నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించింది. దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ ఆ తర్వాత బ్యాటింగ్‌లో తేలిపోయిన రాజస్థాన్‌పై 60 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అలవోక విజయాన్ని అందుకుంది. దాంతో 14 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా ఎనిమిదో ఓటమితో పట్టికలో చిట్టచివరి స్థానానికి రాజస్థాన్ పడిపోయింది. రెండు జట్లకీ లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్‌కాగా రాజస్థాన్ ఇంటికి వెళ్ళింది. కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరాలంటే మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలి. హైదరాబాద్ గెలిస్తే కోల్‌కతా ప్లేఆఫ్ ఆశలు నెరవేరవు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో శుభమన్ గిల్ (36: 24 బంతుల్లో 6x4)తో కలిసి కోల్‌కతా ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ నితీశ్ రాణా (0) తొలి ఓవర్‌‌లో ఔటైపోగా అనంతరం వచ్చిన రాహుల్ త్రిపాఠి (39: 34 బంతుల్లో 4x2, 2x6) బాధ్యతాయుత హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. తరువాత ఒకే ఓవర్‌‌లో గిల్, సునీల్ నరైన్ (0) ఔటైపోగా ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (0) కూడా తేలిపోయాడు. దాంతో క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రసెల్ (25: 11 బంతుల్లో 1x4, 3x6)తో కలిసి ఇయాన్ మోర్గాన్ దూకుడుగా ఆడాడు. సిక్సర్లతో అదరగొట్టాడు.

జోరుమీద వున్న రసెల్ మరీ ముఖ్యంగా కార్తీక్ త్యాగీ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది మూడో సిక్స్ కోసం ప్రయత్నిస్తూ ఔటైపోయాడు. అయినప్పటికీ ఆఖరి వరకూ క్రీజులో నిలిచిన ఇయాన్ మోర్గాన్ (68 నాటౌట్: 35 బంతుల్లో 5x4, 6x6) సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించడమే కాకుండా కోల్‌కతాకి 191 పరుగుల స్కోరుని అందించాడు. చివరి ఓవర్ చివరి బంతిని సిక్సర్ గా మలచడంతో గౌరవమైన స్కోర్ చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు పడగొట్టగా కార్తీక్ త్యాగీకి రెండు, జోప్రా ఆర్చర్‌కి ఒక వికెట్ దక్కింది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో మొదటి ఓవర్ మినహా ఏ దశలోనూ రాజస్థాన్ గెలిచేలా కనిపించలేదు. తొలి ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడేసిన ఓపెనర్లు బెన్‌స్టోక్స్ (18: 11 బంతుల్లో 2x4, 1x6), రాబిన్ ఉతప్ప (6: 2 బంతుల్లో 1x6) ఏకంగా 19 పరుగుల్ని సాధించారు. అదే ఓవర్లో ఆఖరి బంతికి ఉతప్ప ఔటవగా మూడో ఓవర్‌లో బెన్‌స్టోక్స్ వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో ఒత్తిడికి గురైన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు స్టీవ్‌స్మిత్ (4), సంజు శాంసన్ (1), రియాన్ పరాగ్ (0) తక్కువ స్కోరుకే ఔటైపోగా జోస్ బట్లర్ (35: 22 బంతుల్లో 4x4, 1x6), రాహుల్ తెవాటియా (31: 27 బంతుల్లో 2x4, 1x6) జోడీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. కానీ బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోవడంతో సాహసోపేత షాట్లు ఆడక తప్పలేదు. కోల్‌కతా బౌలర్లలో పాట్ కమిన్స్ 4 వికెట్లు పడగొట్టగా శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు, నాగర్‌కోటికి ఒక వికెట్‌ దక్కింది. దీంతో ఓటమి చవిచూసిన రాజస్థాన్ ఇంటికి వెళ్లక తప్పలేదు.

Tags :
|

Advertisement