Advertisement

  • భారత ఐటీ పరిశ్రమ పితామహుడు టీసీఎస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కోహ్లీ కన్నుమూత...

భారత ఐటీ పరిశ్రమ పితామహుడు టీసీఎస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కోహ్లీ కన్నుమూత...

By: chandrasekar Fri, 27 Nov 2020 4:22 PM

భారత ఐటీ పరిశ్రమ పితామహుడు టీసీఎస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన కోహ్లీ కన్నుమూత...


భారత ఐటీ పరిశ్రమ పితామహుడు, టీసీఎస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫకీర్‌ చంద్‌ కోహ్లీ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 96 ఏండ్లు. 1924 మార్చి 19న బ్రిటీష్‌ ఇండియా పెషావర్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌)లో జన్మించారు. ఆయనకో కుమారుడు సంజయ్‌ కోహ్లీ ఉన్నారు. కోహ్లీ మరణం పట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

1991లో టాటా-ఐబీఎం జాయింట్‌ వెంచర్‌లో భాగంగా ఐబీఎంను భారత్‌కు తీసుకురావడంలో ఎఫ్‌సీ కోహ్లీ కీలకపాత్ర పోషించారు. తద్వారా దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్‌ తొలి సీఈవోగా ఆయన అందించిన సేవలు 100 బిలియన్‌ డాలర్ల భారత ఐటీ పరిశ్రమ నిర్మాణానికి బలమైన పునాదులు వేశాయి. 1951లో టాటా ఎలక్ట్రిక్‌ కంపెనీస్‌లో చేరి, అంచెలంచెలుగా ఎదుగుతూ 1970లో డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. ఇదే సమయంలో టీసీఎస్‌ ఆవిష్కరణలో భాగమయ్యారు. 1995-96లో నాస్కామ్‌ అధ్యక్షుడిగా కూడా ఎఫ్‌సీ కోహ్లీ సేవలందించారు. 75 ఏండ్ల వయసులో 1999లో ఆయన రిటైర్‌ అవగా, ఆ తర్వాత కూడా దేశంలో నిరక్ష్యరాస్యతను రూపుమాపేందుకు శ్రమించారు. ఈ క్రమంలోనే 2002లో భారత ప్రభుత్వం ఎఫ్‌సీ కోహ్లీని పద్మ భూషణ్‌తో సత్కరించింది. దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయనకు భారత్‌సహా పలు దేశాల విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.

ఐఐఐటీ హైదరాబాద్‌లో కోహ్లీ సెంటర్‌

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ (ఐఐఐటీ హైదరాబాద్‌)లో ఎఫ్‌సీ కోహ్లీ గౌరవార్థం ఆయన పేరిట ఓ రిసెర్చ్‌ బ్లాక్‌ను టీసీఎస్‌ ఏర్పాటు చేసింది. టీసీఎస్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను 2017 జనవరి 16న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన కోహ్లీని కేటీఆర్‌ సన్మానించారు. భారత ఐటీ రంగ పితామహుడిగా పేరొందిన ఎఫ్‌సీ కోహ్లీ మరణం ఆ రంగానికి తీరని లోటని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. గురువారం ట్విట్టర్‌లో కోహ్లీ మరణం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ‘దేశ ఐటీ రంగానికి ఎఫ్‌సీ కోహ్లీ చేసిన సేవలు మరువలేనివి. టీసీఎస్‌ వ్యవస్థాకుడిగా, సీఈవోగా ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

Tags :
|
|
|

Advertisement