Advertisement

  • ఐపీల్ 2020 లో మొదటి శతకం చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డ్

ఐపీల్ 2020 లో మొదటి శతకం చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డ్

By: chandrasekar Fri, 25 Sept 2020 08:43 AM

ఐపీల్ 2020 లో మొదటి  శతకం చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డ్


యూఏఈ లో జరిగే ఐపీల్ 2020 లో మొదటి శతకం చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డ్ నమోదు చేసాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన రాహుల్ 66 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ సీజన్‌లో శతకం బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రాహుల్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో శతకం కావడం విశేషం. 69 బంతుల్లోనే 132 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన రాహుల్ (14x4, 7x6) ఐపీఎల్ చరిత్రలోనే హయ్యస్ట్ స్కోర్ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రాహుల్ విధ్వంసంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో 200+ స్కోరు చేసిన మూడో జట్టు పంజాబ్ కావడం గమనార్హం. రాహుల్ శతకానికి ముందు ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేశాడు. స్టెయిన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపు మీదున్న రాహుల్ తర్వాతి లో ఫుల్ టాస్‌ను కూడా సిక్స్ మలిచే ప్రయత్నం చేశాడు. పరుగుల కోసం వేగం పెంచడంతో అది క్యాచ్ గా వెళ్ళింది.

రాహుల్ కొట్టిన షాటు బౌండరీ లైన్ దగ్గరున్న కోహ్లికి క్యాచ్‌గా వెళ్లింది. పెద్ద కష్టమైన క్యాచ్ కాకున్నా బెస్ట్ ఫీల్డర్లలో ఒకడైన కోహ్లి ఆ క్యాచ్‌ను వదిలేశాడు. 83 పరుగుల వద్ద రాహుల్‌కు ఈ లైఫ్ వచ్చింది. నవదీప్ సైనీ వేసిన తర్వాతి ఓవర్లో లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ బంతిని గాల్లోకి లేపాడు. కొద్ది దూరం పరిగెత్తుకుంటూ వెళ్లిన కోహ్లి తేలికైన క్యాచ్‌ను మళ్ళీ నేలపాలు చేశాడు. ఆ సమయంలో రాహుల్ 60 బంతుల్లో 89 రన్స్ చేశాడు. తొలి క్యాచ్‌ను వదిలేసినప్పుడు కాస్త సీరియస్‌గా ఉన్న కోహ్లి రెండోసారి తన అసహనాన్ని వదిలి నవ్వుకున్నాడు. కోహ్లి లాంటి ఫీల్డర్ రెండు క్యాచ్‌లు వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న రాహుల్ ఆ తర్వాతి సింగిల్స్, డబుల్స్ తీయడం మానేసి సిక్సులు, ఫోర్లతో హోరెత్తించాడు. స్టెయిన్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా ఓ సిక్స్, ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టడంతో.. ఆ ఓవర్లో మొత్తం 26 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్లో రాహుల్ ఓ ఫోర్, రెండు సిక్సులు కొట్టగా.. మొత్తం 23 రన్స్ వచ్చాయి. దీంతో పంజాబ్ 200 పరుగులు దాటింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఐపీఎల్‌లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత క్రికెటర్‌గా సచిన్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు. రాహుల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయడంతో బాటు చాలా వేగంగా పరుగులు చేయడంతో త్వరగా ఈ రికార్డు చేయగలిగాడు.

Tags :
|

Advertisement