దుబాయ్ వెళ్తూ లోకేశ్ రాహుల్ దయాగుణం
By: Dimple Sat, 22 Aug 2020 10:17 PM
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టన్ లోకేశ్ రాహుల్ దయాగుణాన్ని ప్రదర్శించడంలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు. దుబాయ్ వెళ్తూ బెంగళూరు విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందికి పిపిఈ కిట్లను ఉచితంగా పంపిణీ చేశాడు. గతంలోనూ రాహుల్ ఇలాంటి సహాయాలు చేశాడు.
తలసేమియా రోగుల కోసం వన్డే, టీ20 జెర్సీలు, ప్రపంచకప్ కిట్కు వేలం నిర్వహించాడు. ఇప్పుడు కెంపెగౌడ విమానాశ్రయంలో పీపీఈ కిట్లు పంచాడు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్లకోసం దుబాయ్ విమానం ఎక్కే ముందుగా కేఎల్ రాహుల్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. పదిమందికి సాయపడాలన్న స్ఫూర్తిని రగిలించాడు.
కొవిడ్-19 మహమ్మారిని నియంత్రించేందుకు ముందు వరుసలో నిలబడి పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ పోలీసులకు పీపీఈ కిట్లు అందజేశాడు. వారంతా ధైర్యంగా విధులు నిర్వర్తిస్తుండటంతోనే మనమంతా సురక్షితంగా ఉన్నామని పేర్కొన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 కోసం కేఎల్ రాహుల్ దుబాయ్ చేరుకున్న సంగతి తెలిసిందే. అతనిప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. లాక్డౌన్ మొత్తం బెంగళూరులోనే ఉన్నాడు. ఐపీఎల్ జరుగుతుందని ప్రకటించిన తర్వాత పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో అక్కడే సాధన చేశాడు.
దుబాయ్ వెళ్లేందుకు బెంగళూరు విమానాశ్రయానికి వచ్చిన కేఎల్ రాహుల్ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేశాడు. ‘పగలు రాత్రీ అన్న తేడా లేకుండా వారు మనల్ని కాపాడుతున్నారు. వారంత రిస్క్ చేస్తున్నారు కాబట్టే మనమింత సురక్షితంగా ఉన్నాం.
అందుకే సీఐఎస్ఎఫ్ సిబ్బంది జాగ్రత్తగా, సౌకర్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత నా ఒక్కడిదే కాదు. మనందరిదీ. నా తరఫు నుంచి ఇదో చిన్న సాయమంతే’ అని రాహుల్ అన్నాడు.