Advertisement

ట్విట్టర్ ద్వారా మీడియాకు ఖుష్బూ క్షమాపణలు

By: chandrasekar Thu, 11 June 2020 02:40 AM

ట్విట్టర్ ద్వారా మీడియాకు ఖుష్బూ క్షమాపణలు


ప్రముఖ నటి ఖుష్బూ ‌కు చెందిన ఒక ప్రైవేట్ వాయిస్ మెసేజ్ వివాదాస్పదమైంది. మీడియాను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలతో కూడిన వాయిస్ మెసేజ్ బయటకు లీకైంది. ఈ వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖుష్బూ స్వయంగా స్పందించారు. తన వాయిస్ మెసేజ్‌ను ఎడిట్ చేసి లీక్ చేశారని ఆమె అన్నారు. మీడియాకు క్షమాపణలు చెప్పారు.

షూటింగ్స్ ప్రారంభించడం కోసం ఖుష్బూ సహా పలువురు బుల్లితెర టెక్నీషియన్లు, పెద్దలు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మొత్తానికి షూటింగ్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో సుమారు 70 రోజుల తరవాత నిన్నటి నుంచి చెన్నైలో టీవీ షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో టీవీ నిర్మాతల వాట్సాప్ గ్రూపులో ఖుష్బూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. మీడియాను టీవీ సెట్స్ వద్దకు అనుమతించవద్దని ఆ మెసేజ్‌లో ఖుష్బూ అన్నారు.

‘‘వాళ్లకు ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వొద్దు. మనం ఎప్పుడు పని మొదలుపెడతామా అని వాళ్లు చూస్తున్నారు. ప్రెస్ వాళ్లకు ప్రస్తుతం కోవిడ్-19 న్యూస్ తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి, మనం షూటింగ్స్ తిరిగి ప్రారంభించగానే ఏదో ఒకటి రాద్దామని వాళ్లు వేచి చూస్తున్నారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అని ఆ వాయిస్ మెసేజ్‌లో ఖుష్బూ అన్నారు. ఈ వాయిస్ మెసేజ్‌ను ఎవరో లీక్ చేశారు. దీంతో ఖుష్బూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

khushboo,apologizes,to the media,via,twitter ,ట్విట్టర్, ద్వారా, మీడియాకు, ఖుష్బూ, క్షమాపణలు


ట్విట్టర్ ద్వారా మీడియాకు ఖుష్బూ క్షమాపణలు చెప్పారు. ‘‘ప్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన నా వాయిస్ మెసేజ్‌ను ఎడిట్ చేశారు. మా నిర్మాత గ్రూప్ నుంచి అది బయటికి వచ్చింది. మా మధ్య ఇలాంటి నీఛమైన వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ప్రెస్ వాళ్లను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. మన స్నేహితుల మధ్య ఎలా మాట్లాడుకుంటామో అలానే నేనూ మాట్లాడాను.

ప్రెస్ మీద నాకున్న గౌరవాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. జర్నలిస్టులకు కూడా ఈ విషయం తెలుసు. నా 34 ఏళ్ల సినిమా జీవితంలో ఒక్కసారి కూడా నేను వాళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు, అమర్యాదపరచలేదు. ఆ వాయిస్ మెసేజ్ సగమే ఉంది. అయినప్పటికీ, మీలో ఎవరినైనా నేను బాధపెట్టిఉంటే నిజాయతీగా క్షమాపణలు చెబుతున్నాను’’ అని ఖుష్బూ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

ఈ వాయిస్ మెసేజ్‌ను లీక్ చేసినవారిని ఉద్దేశించి మరో ట్వీట్ కూడా చేశారు ఖుష్బూ. ‘‘నువ్వు ఎవరికోసమైతే పనిచేస్తావో వాళ్లే నిన్ను వెన్నుపోటు పొడిస్తే చాలా బాధగా ఉంటుంది. ఈ పని ఏ నిర్మాత చేశాడో నాకు తెలుసు. కానీ, అతని పేరును నేను బయటపెట్టను. నేను ఏమీ మాట్లాకుండా క్షమించి వదిలేయడమే వారికి పెద్ద శిక్ష. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను కంటిన్యూ చేస్తా’’ అని ఖుష్బూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement