పూర్తయిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం .. తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు
By: Sankar Tue, 01 Sept 2020 5:57 PM
ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్ నం. 4 వద్ద మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది.
మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనం కంటే ముందు.. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. బై బై గణేశా నినాదాలతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు మార్మోగిపోయాయి.
మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. భక్తుల సందడి మధ్య ఐదారు గంటల పాటు శోభాయమానంగా సాగింది. కరోనా వైరస్ సంక్రమణ క్రమంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. వైరస్ ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గినా.. విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంటిలో ప్రతిష్టించిన చిన్నచిన్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది.