Advertisement

కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు

By: Sankar Fri, 02 Oct 2020 3:11 PM

కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు


కేరళలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కచోట ఐదుగురు మించి గుమిగూడటాన్ని నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144ను అమలు చేయనున్నట్టు ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా గురువారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మంది గుమిగూడటం వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఆదేశాలు అక్టోబరు 3 శనివారం ఉదయం 9 గంటల నుంచి అమల్లోకి వస్తాయనీ.. ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి కరోనా వైరస్ కట్టడికి కలెక్టర్లు సెక్షన్- 144 కింద సంబంధిత నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా, దేశంలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో కేరళ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత కేరళలోనే యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయి. మొత్తం 2 లక్షల మంది కరోనా బారినపడగా.. వీరిలో 1,31,048 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 72 వేల మందికిపైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, కేరళలో మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది.

Tags :
|

Advertisement