కేరళ గోల్డ్ స్కామ్ లో విచారణ ముమ్మర౦: 303 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసిన ఈడీ
By: chandrasekar Thu, 08 Oct 2020 1:31 PM
తిరువనంతపురం ఎయిర్
పోర్ట్ లో జూలై నెలలో 30 కిలోల బంగారం అక్రమంగా సరఫరా చేస్తుండగా కస్టమ్స్
అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
దీనికి కారణం ఈ కేసులో పెద్ద పెద్ద వ్యక్తులు, రాజకీయనేతల పై ఆరోపణలొచ్చాయి. ఈ కేసు విచారణ చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్
డైైరెక్టరేట్ ముగ్గురు నిందితులతో పాటు 25 మంది సాక్ష్యుల్ని విచారించింది. 303 పేజీల
చార్జిషీట్ను ఈడీ బుధవారం దాఖలు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ
ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశంకర్ పై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.
ఇప్పటికే ఆగస్టు 12, 15న శివ శంకర్ స్టేట్మెంట్ను ఈడీ రికార్డ్ చేసింది. స్వప్న సురేష్తో కలిసి తన
చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాత్ పాటు ఆయన ఎస్బీఐ లో జాయింట్ బ్యాంక్ లాకర్
తెరిచారు. గోల్డ్ స్మగ్లింగ్ చేయటంలో స్వప్నసురేష్ కీలక సూత్రధారి అని ఈడీ
నిర్థారించింది. స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బును, బంగారాన్ని స్వప్న
బ్యాంకు లాకర్లలో భద్ర పరిచింది. ఇప్పటికే బ్యాంకు లాకర్లను ఎన్ఐఏ అధికారులు సీజ్
చేశారు. ఈ కేసులో ఏ2 నిందితురాలు స్వప్న సురేష్తో 2017 నుంచి
తనకు పరిచయం ఉన్నట్టు మాజీ ఐఏఎస్ అధికారి తెలిపారు. స్వప్న కుటుంబం సభ్యులతోనూ
మాజీ ఐఏఎస్ కు సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం.
ఇంకోవైపు కర్ణాటకలో కలకలం
రేపుతున్న డ్రగ్స్ మాఫియా వ్యవహారానికి కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధం
ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంగతి స్వయంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లోని ఓ సీనియర్
అధికారి పేర్కొన్నారు. బెంగుళూరు డ్రగ్స్ కేసు లో కీలక నిందితుడు డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్, కేరళ
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు కె టి రమీస్ మధ్య జరిగిన సంభాషణలే
ఇందుకు ఆధారంగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య నిత్యం సంప్రదింపులు జరిగాయని అధికారి తెలిపారు.
మొదటినుంచి ఈ రెండు కేసులకి మధ్య సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా నిందితుల మధ్య జరిగిన సంభాషణలు అనుమానాలకు మరింత బలానిచ్చాయి.
ఇప్పటికే ఎన్సిబి అధికారులు మహ్మద్ అనూప్ సహా మరో ఇద్దరు నిందితులను
అదుపులోకి తీసుకున్నారు.