భర్త వివాహేతర సంబంధం ...వేధింపులు తట్టుకోలేక భార్య మృతి
By: Sankar Mon, 12 Oct 2020 11:48 AM
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం నంద్యాల పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.నంద్యాల టూటౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం ముత్తలూరు గ్రామానికి చెందిన గండ్ర పుల్లయ్య వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కీర్తి (33)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరూ విద్యావంతులు కావటంతో పెళ్లి అనంతరం ఉద్యోగం కోసం నంద్యాల పట్టణానికి వచ్చి ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు. స్థానిక నాగార్జున ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పుల్లయ్య, గుడ్షెప్పర్డ్ స్కూల్లో టీచర్గా కీర్తి ఉద్యోగంలో చేరారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. సంతోషంగా సాగుతున్న వీరి సంసార జీవితంలో ఓ యువతి చిచ్చురేపింది.
నాగార్జున కాలేజీలో చదువుకున్న సుభాషిణి ప్రస్తుతం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ట్రెజరీ కార్యాలయంలో అసిస్టెంట్ క్లర్క్గా పనిచేస్తోంది. ఈ యువతి పుల్లయ్య స్టూడెంట్. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో పుల్లయ్య, కీర్తి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఏకంగా సుభాషిణిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను కీర్తి సెల్కు పంపి వేధించేవారు.తమకు అడ్డుగా ఉన్నావంటూ సుభాషిణి తరచూ ఆమె ఫోన్కు మెసేజ్లు పెట్టడం, మరోవైపు భర్త కూడా మానసికంగా వేధింపులకు గురిచేయడంతో జీవితంపై విరక్తి చెందిన కీర్తి శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది