కౌన్ బనేగా క్రోర్పతి-12 సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళ
By: chandrasekar Sat, 07 Nov 2020 3:59 PM
కౌన్ బనేగా క్రోర్పతి-12 సీజన్లో
తొలి మహిళ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా సోనీటీవీలో
ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా క్రోర్పతి-12’
సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళగా నజియా
నసీమ్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ నెల 11న ప్రసారం కానున్న షో ప్రోమోను సోనీటీవీ ట్వీట్
చేసింది. 35 సెకన్ల నిడివి ఉన్న ఈ
వీడియోలో ఢిల్లీకి చెందిన కమ్యూనికేషన్ మేనేజర్ నజియా నసీమ్, హోస్ట్
అమితాబ్ ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఆమె తెలివితేటలను ప్రశంసించిన అమితాబ్ గేమ్
గొప్పగా ఆడారని కొనియాడాడు. అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా, అమితాబ్
ఒక్కసారిగా తన గంభీరమైన గొంతుతో ‘ఏక్ కరోడ్’ అని కరతాళ ధ్వనుల మధ్య చెబుతాడు.
ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, రంగురంగుల విద్యుద్దీపాల కాంతుల మధ్య నుంచి ఆమెను
అభినందిస్తూ రంగుకాగితాలు పై నుంచి నేలకు జారాయి.
ఆమె ఆనందానికి
అంతులేకుండా పోయింది. నజియా తనను తాను నమ్మలేకపోయారు. కాసేపటి తర్వాత కానీ
తేరుకోలేకపోయారు. అమితాబ్ ఆ తర్వాత 7 కోట్ల రూపాయల ప్రశ్న అడగడంతో వీడియో ముగుస్తుంది.
కౌన్ బనేగా క్రోర్పతి-12 సెప్టెంబరు 28న ప్రారంభమైంది. ఈ సీజన్లో పలుమార్పులు
చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఆడిషన్స్ను ఆన్లైన్లో
నిర్వహించారు. అలాగే, షో చరిత్రలో తొలిసారి ఆడియన్స్ పోల్ లైఫ్లైన్ను
ఎత్తివేశారు. అమితాబ్ బచ్చన్కు మాత్రం ఈ సంవత్సరం ఓ ప్రత్యేకతను మిగల్చబోతోంది. ఈ
ఏడాదితో కేబీసీతో బిగ్ బీ అనుబంధం రెండు దశాబ్దాలు. 2000వ
సంవత్సరంలో షోను ప్రారంభించగా, మూడో సీజన్లో తప్ప ప్రతి సీజన్లోనూ అమితాబ్
వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఆ సీజన్లో మాత్రం షారూక్ ఖాన్ హోస్ట్గా
వ్యవహరించాడు. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.