కచ్చితంగా ఆరోగ్యసేతు వాడాలన్న రూల్ ఏమిలేదు ..కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
By: Sankar Wed, 21 Oct 2020 11:59 AM
స్మార్ట్ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ లేదనే కారణంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలు ప్రజలకు సేవలను నిరాకరించటానికి లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది.
కరోనా వైరస్ బాధితులపై నిఘా పెట్టే ఆరోగ్య సేతు మొబైల్ యాప్ను ప్రజలు స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని ఉండాలని రైల్వే, మెట్రోరైల్, ఆర్టీసీ వంటి పలు ప్రభుత్వ సంస్థలు షరతును విధించాయి. అరవింద్ అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ను దాఖలు చేశారు. కోర్టు స్పందిస్తూ ఆరోగ్యసేతు తప్పనిసరి కాదని పేర్కొంటూ, కేంద్రానికి అభ్యంతరాల దాఖలుకు అవకాశమిస్తూ విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది.
కాగా ప్రాణాంతక కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు కొన్ని వేల పాజిటివ్ కేసులను ట్రేస్ చేసినట్లు సమాచారం. దీంతో కరోనా బాధితులను గుర్తించడంతో పాటు వారిని అప్రమత్తం చేసి తగిన చికిత్స అందించడం ఆరోగ్య కార్యకర్తలకు తేలికైంది. ఇక ఆరోగ్య సేతు యాప్నకు సుమారు 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు