కరోనా కేసుల పెరుగుదలతో బెంగుళూరులో మళ్ళీ లాక్ డౌన్ ..
By: Sankar Sun, 05 July 2020 1:45 PM
కర్ణాటకలో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది ..ముఖ్యంగా బెంగుళూరు లో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్నాయి ..దీనితో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో 33 గంటల లాక్ డౌన్ ప్రకటించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. లాక్ డౌన్ శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుంది. బెంగళూరు పరిధిలో లాక్ డౌన్ ను సీఎం యెడియూరప్ప విధిస్తున్నారని బెంగళూరు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. కేవలం నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందని, ఇతరులెవరు బయట తిరిగినా చర్యలు ఉంటాయని ప్రకటించారు.
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ లాక్ డౌన్ విధిస్తోందని చెప్పారు. దీంతో పాటు హోం ఐసోలేషన్ కాలాన్ని 14 రోజుల నుంచి 17 రోజులకు పెంచుతున్నట్లు చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు బూత్ లెవల్లో ఓ కమిటీని ఏర్పాటు చేశారు అందులో ఓ ఆరోగ్యాధికారి, పోలీసు, స్థానిక మున్సిపాలిటీ లేదా పంచాయతీ వాలంటీర్లు ఉంటారు. ఇలా మొత్తం 8,800 టీంలు బెంగళూరులో తయారయ్యాయి. ప్రతి 198 వార్డులకు రెండు అంబులెన్సులను ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే పదో తరగతి చివరి పరీక్షలు రాసేందుకు హాజరైన 7,71,506 మంది విద్యార్థుల్లో 32 మంది కరోనా సోకిందని కర్ణాటక ప్రభుత్వం శనివారం తెలిపింది. ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు వద్దంటున్నప్పటికీ ప్రభుత్వం ఈ పరీక్షలను జూన్ 25–జూలై 3 మధ్య నిర్వహించింది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. మరో 80 మంది విద్యార్థులను హోం క్వారంటైన్లో ఉంచారు. 32 మంది విద్యార్థులను కలసిన వారిని, ఒకేచోట పరీక్షలు రాసిన వారిని క్వారంటైన్లోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు.