వచ్చే ఎన్నికలలో మద్దతు కోసం రజినీకాంత్ ఇంటికి వెళ్తా ...కమల్ హాసన్
By: Sankar Tue, 01 Dec 2020 9:54 PM
వచ్చే సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్స్టార్ రజనీకాంత్ మద్దతు కోరతానని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్హాసన్ తెలిపారు. రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నానన్న కమల్.. తన మిత్రుడు రజనీకాంత్ ఇంటిని వదిలేస్తానా..? అంటూ వ్యాఖ్యానించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం రైతులు డిమాండ్లను వినాలని కమల్ హాసన్ సూచించారు. వారి డిమాండ్లను పట్టించుకోవాలని కేంద్రానికి ఆయన విన్నవించారు. ఈ మేరకు కమల్ హాసన్ మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.