కరోనావైరస్తో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులు
By: chandrasekar Wed, 03 June 2020 3:04 PM
కరోనావైరస్ వ్యాప్తిని
అరికట్టేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారికి అవగాహన
కల్పించేందుకు కృషిచేస్తోన్న జర్నలిస్టుల సేవలు మరవలేమని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనావైరస్తో నిత్యం
ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకుని వారికి అండగా నిలబడాలంటూ దాఖలైన
ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
న్యాయవాది రాపోలు భాస్కర్
దాఖలు చేసిన పిల్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన సందర్భంగా
హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాణాలకు తెగించి కరోనావైరస్ సంబంధిత
వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని పిటీషనర్
రాపోలు భాస్కర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఆర్థిక సహాయంతో పాటు వారికి హెల్త్ ఇన్సూరెన్స్
సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పిటీషనర్ రాపోలు
భాస్కర్ కోర్టును కోరారు.
పిటీషనర్ తరపున సీనియర్
కౌన్సిల్ మాచర్ల రంగయ్య కోర్టులో వాదనలు వినిపించారు. జర్నలిస్టులకు మెడికల్
కిట్లు, మాస్కులు, ఉచితంగా
అందించాలని పిటీషనర్ రాపోలు భాస్కర్ చేసిన విజ్ఞప్తిని ఆయన కోర్టు దృష్టికి
తీసుకెళ్లారు. న్యాయవాదులకు రూ 25 కోట్ల కేటాయించిన ప్రభుత్వం అలాగే జర్నలిస్టులను
సైతం ఆదుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నారు.
పిటిషనర్ తరపు న్యాయవాది
వాదనలు విన్న హై కోర్టు పిటిషనర్ వాదనలను సమర్థిస్తూ జర్నలిస్టుల పట్ల సానుకూలంగా
స్పందించింది. రెండు వారాల్లో
ప్రభుత్వానికి జర్నలిస్టుల సమస్యలపై ఓ రిప్రజెంటేషన్ ఇవ్వాలని హైకోర్టు
వ్యాఖ్యానించింది. అదే సమయంలో రిప్రజెంటేషన్ అందిన తర్వాత రెండు వారాల్లో
జర్నలిస్టుల సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు తెలంగాణ
సర్కారుకి సూచించింది. అయితే, పిటిషనర్ వాదనలపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర
అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సైతం ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగానే
ఉందని తెలిపారు.