జోప్రా ఆర్చర్, ఈసీబీ ఫై తీవ్ర స్థాయిలో మండి పడ్డ హోల్డింగ్
By: chandrasekar Fri, 17 July 2020 10:02 AM
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్
జోప్రా ఆర్చర్పై బయో - సెక్యూర్ రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా పెద్ద ఎత్తున
విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌథాంప్టన్ నుంచి మాంచెస్టర్కి కారులో వెళ్లిన
జోప్రా ఆర్చర్ మధ్యలో తన ఇంటికి వెళ్లి కాసేపు గడిపాడు. దాంతో బయో - సెక్యూర్
రూల్స్ని జోప్రా ఆర్చర్ బ్రేక్ చేసినట్లు తేల్చిన ఇంగ్లాండ్, వేల్స్
క్రికెట్ బోర్డు వెస్టిండీస్తో గురువారం ఆరంభమైన రెండో టెస్టు నుంచి అతడ్ని
తప్పించింది. కనీసం ఐదు రోజులు అతను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని ఆదేశించిన ఈసీబీ.
ఈ ఐదు రోజుల్లో రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వస్తేనే
జట్టుతో మళ్లీ చేరేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.
కరోనా వైరస్ కారణంగా గత
మార్చి నుంచి అంతర్జాతీయ క్రికెట్కి బ్రేక్లు పడగా ఇంగ్లాండ్, వెస్టిండీస్
మధ్య మూడు టెస్టుల సిరీస్ని పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో ఈసీబీ
నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపైకి నెల రోజుల ముందే విండీస్ టీమ్ని
రప్పించిన ఈసీబీ వారిని 14 రోజులు క్వారంటైన్లో ఉంచింది. మరోవైపు ఇంగ్లాండ్
క్రికెటర్లకి కూడా క్యాంప్ని ఏర్పాటు చేసి వారిని కుటుంబ సభ్యులతో కూడా
కలవనివ్వలేదు. మొత్తంగా ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు మ్యాచ్ అధికారులకి కూడా కరోనా
పరీక్షలు నిర్వహించి నెగటివ్ అని తేలిన తర్వాతే ఆటలోకి ఈసీబీ అనుమతించింది.
తాజాగా జోప్రా ఆర్చర్
తొందరపాటు కారణంగా ఈ బయో-సెక్యూర్ వాతావరణం మొత్తం దెబ్బతినే ప్రమాదంలో పడింది.
జోప్రా ఆర్చర్ తీరుపై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ తీవ్ర
స్థాయిలో మండిపడ్డాడు. ‘‘జోప్రా ఆర్చర్పై నాకేమీ సానుభూతి లేదు. అయినా అతను
ఎందుకు అలా బుద్దిలేకుండా వ్యవహరించాడో నాకు అర్థంకావడం లేదు. ఈసీబీ కూడా ఇక్కడ
తెలివి లేకుండా వ్యవహరించింది. ఇంగ్లాండ్ జట్టులోని అందరికీ కరోనా నెగటివ్ అని
ఇటీవల రిపోర్ట్ వచ్చింది. మరి టీమ్ మొత్తాన్ని బస్సులో మాంచెస్టర్కి తరలించొచ్చు
కదా వ్యక్తిగత కారులో వెళ్లేందుకు క్రికెటర్లకి ఎందుకు అనుమతిచ్చారు? ఆ
దిశగా కాస్త ఈసీబీ ఆలోచించి ఉండాల్సింది’’ అని హోల్డింగ్ మండిపడ్డాడు.