Advertisement

జో బైడెన్‌ బంధువులు ముంబయిలో

By: chandrasekar Mon, 09 Nov 2020 2:55 PM

జో బైడెన్‌ బంధువులు ముంబయిలో


జో బైడెన్‌ బంధువులు భారతదేశం లో వున్నారని తెలిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించడంతో భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. కమలా తల్లి తమిళనాడుకు చెందినవారు కావడంతో ఆ రాష్ట్రంలో సందడి నెలకొంది. కానీ కేవలం కమలా హ్యారిస్‌కు మాత్రమే కాదు, అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కూ భారత్‌తో కుటుంబం అనుబంధం ఉన్నట్లు సమాచారం. ముంబయిలో ఐదుగురు బైడెన్‌లు ఉన్నారనే వార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఉపాధ్యక్షుడి హోదాలో భారత్‌కు వచ్చినప్పుడు జో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కుటుంబానికి చెందిన ఐదుగురు దూరపు బంధువులు ముంబయిలోనే ఉన్నారని ఆయన అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలోనూ ఈ విషయాన్ని మరోసారి బైడెన్ ప్రస్తావించడమే కాదు, వారి వివరాలను తెలిపారు. అయితే, ఈ వివరాలను జో వెల్లడించినప్పటికీ తామే బైడెన్ బంధువులమని ఇప్పటివరకూ ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం. భారత్‌లో 2013లో పర్యటించిన బైడెన్ జులై 24న బాంబే స్టాక్‌ ఎక్ఛేంజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆ సమయంలో ‘బైడెన్‌ ఫ్రమ్‌ ముంబయి’ అంటూ తనకు భారత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. భారత్‌లో పర్యటించడం ఎంతో గౌరంగా భావిస్తాను ముఖ్యంగా ముంబయికి రావడం నాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు.

జో బైడెన్‌ మాటల్లో.. నేను 29ఏళ్ల వయసులో (1972) తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యా. ఆ సమయంలో భారత్‌ నుంచి బైడెన్‌ పేరుతో దూరపు బంధువు అయ్యే వ్యక్తి నుంచి ఉత్తరం వచ్చింది. అయితే, తర్వాత వారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని చింతిస్తున్నాను అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. కానీ, కుటుంబచరిత్రలపై పరిశోధనలు చేసేవారు ఎవరైనా తమ బంధువుల గురించి సమాచారం అందజేయాలని బైడెన్‌ కోరారు. అనంతరం రెండేళ్ల తర్వాత 2015లో వాషింగ్టన్‌ వేదికగా భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, కార్నేగ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషన్ పీస్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ మాట్లాడుతూ భారత్‌లోని తమ బంధువుల గురించి స్పష్టత ఇచ్చారు. వరుసకు ముత్తాత అయ్యే జార్జ్ బైడెన్ గ్రేట్ గ్రాండ్‌ఫాదర్ ఈస్ట్‌ ఇండియా ట్రేడింగ్‌ కంపెనీలో కెప్టెన్‌గా పనిచేసి పదవీవిరమణ అనంతరం ముంబయిలోనే స్థిరపడ్డారు. అంతేకాదు ఆయన భారతీయ మహిళను వివాహం చేసుకున్నారు. మొబైల్‌ నంబర్‌ సహా వారి వివరాలను నాకు కొందరు అందించారు. అయితే, ఇప్పటివరకు వారిని నేను సంప్రదించలేదు. కానీ, వారిని కలిసే ప్రయత్నం చేస్తాను అని ఈ సమావేశంలో బైడెన్ పేర్కొన్నారు. కానీ, తర్వాత బైడెన్‌ వారిని కలిశారా? లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికైన నేపథ్యంలో ఆయన‌ బంధువులు ముంబయిలో ఉన్నారన్న విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. కానీ ఇంతవరకు తామే జో బైడెన్‌ బంధువులని ముందుకు రాలేదు.

Tags :
|
|

Advertisement