అమెరికా కొత్త అద్యక్షుడిగా డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్...ట్రంప్ ఆశలు ఆవిరి
By: Sankar Sun, 08 Nov 2020 06:37 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడింది.. వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపిన.. ఫైనల్ రిజల్ట్ వచ్చేసింది. అగ్రరాజ్యపు 46 అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు ఓటమి తప్పలేదు. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన 273 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బైడెన్.. అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ట్రంప్ మాత్రం 214 దగ్గరే నిలిచిపోయింది.
వారం రోజులుగా ప్రహసనాన్ని తలపించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎట్టకేలకు తేలింది. నవంబర్ 3న మొదలైన పోలింగ్ నుంచి.. ఆ తర్వాత జరిగిన కౌంటింగ్ ప్రక్రియ వరకు.. అంతా ఉత్కంఠగా సాగింది. ప్రి, పోస్ట్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పించడంతో... ప్రక్రియ ఎంతకూ ముగియలేదు. దాదాపు వారం రోజుల పాటు ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల ఫలితాల్లో.. ఫైనల్గా జోబైడెన్ విక్టరీ సాధించారు.
కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి.. జో బైడెన్ ఆధిక్యం కనబరుస్తుండగా ట్రంప్ వెనుకంజలోనే ఉన్నారు. రిపబ్లికన్లను గట్టిపట్టున్న రాష్ట్రాల్లోనూ.. ఈ సారి డెమెక్రాట్స్ సత్తా చాటడం విశేషం. అయితే, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నంత సేపు.. మళ్లీ తానే అధ్యక్షుడినంటూ తన ప్రకటనలతో ఊహాగానాలు కల్పించారు డొనాల్డ్ ట్రంప్. కౌంటింగ్ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్ వర్గం.. కోర్టులను ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. ప్రతీచోటా.. ట్రంప్కు చుక్కెదురైంది.
పోలింగ్ తర్వాత వచ్చిన ఓట్లను లెక్కించడం ఆపాలంటూ ట్రంప్ వర్గం ఎంత అరిచి గీపెట్టగా... ఆఖరి ఓటు వరకు లెక్కించాల్సిందేనంటూ జో బైడెన్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఎన్నికల ఫలితంతో అమెరికా ప్రజలు మార్పు కోరుకున్నారని స్పష్టమవుతోంది.