అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ కమలా హ్యారిస్...
By: Sankar Wed, 12 Aug 2020 10:40 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందు నుంచి ఇండియన్ ఓట్ల మీద ఎక్కువగా ద్రుష్టి సారించిన డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్..మరోసారి భారతీయులను ఆకట్టుకునేందుకు ఒక కీలక ప్రకటన చేసాడు..భారత సంతతి మహిళ, కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ను డెమొక్రాట్ల తరఫున వైస్-ప్రెసిడెంట్ అభ్యర్థిగా మంగళవారం ప్రకటించారు.
ఈ మేరకు డెమొక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ పేరును ఖరారు చేసింది. కమలా హ్యారిస్ పేరును అధికారికంగా ప్రకటించిన జో బిడెన్.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ఓ మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడటం ఇదే తొలిసారి. అంతేకాదు, ఓ పెద్ద పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న నాలుగో మహిళ కావడం మరో విశేషం.
తమిళ మూలాలున్న కమలా హ్యారిస్.. తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. తర్వాత జమైకాకు చెందిన హ్యారిస్ను వివాహం చేసుకున్నారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం న్యాయవాద వృత్తిని చేపట్టి.. 2003లో శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే సెనేట్కు ఎంపికయిన ఆమె.. ఈ సారి ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
తనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారుచేయడంపై కమలా హ్యారిస్ హర్షం వ్యక్తం చేస్తూ జో బిడెన్కు ధన్యవాదాలు తెలిపారు. ‘జోబిడెన్ అమెరికన్ ప్రజలను ఏకం చేయగలడు ఎందుకంటే ఆయన మన కోసం పోరాడుతూ తన జీవితాన్ని గడిపారు. అధ్యక్షుడిగా ఆయన మన ఆదర్శాలకు అనుగుణంగా ఉండే అమెరికాను నిర్మిస్తారు. తనను ఉపాధ్యక్ష పదవికి మా పార్టీ నామినీగా చేరడం గౌరవం.. పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతలు పూర్తిచేస్తాం’అని అన్నారు.