తీవ్రంగా కొట్టడం వల్లనే ఆ తండ్రి కొడుకులు చనిపోయారు ..సిబిఐ
By: Sankar Wed, 26 Aug 2020 8:09 PM
తమిళనాట ప్రకంపనలు రేపిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసులో సీబీఐ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. సత్తాన్కుళంకు చెందిన జయరాజ్, బెనిక్స్ పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు పేర్కొంది. కాగా కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ను ఆశ్రయించారు..
ఈ సందర్భంగా.. తగిన ఆధారాలతో కోర్టు ముందు హాజరైన సీబీఐ అధికారి.. విచారణలో భాగంగా మురుగన్, థామస్ జయరాజ్, బెనిక్స్లను తీవ్రంగా కొట్టినట్లు ఇద్దరు మహిళా హెడ్ కానిస్టేబుళ్లు వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 38 మందిని విచారించామని కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలో పోలీసు అధికారులు తండ్రీకొడుకులు చిత్రహింసలకు గురిచేసినట్లు తేలిందన్నారు. లోతైన గాయాల కారణంగానే వారిద్దరు మృతి చెందినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైందని కోర్టుకు తెలిపారు. ఇక కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఎస్ఐ పాల్దురై ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే.
కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి.